హైదరాబాద్: నిమ్స్ ఆసుపత్రిలో ఓ డాక్టర్ ఆన్లైన్ ఫ్లాట్ఫాం వేదికగా కుర్చీని అమ్మబోయిన డాక్టర్కు రూ. 2.58 లక్షలు సైబర్ కేటుగాళ్లు టోకరా వేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిమ్స్ హాస్పిటల్లో సీనియర్ రెసిడెంట్గా పని చేస్తున్న ఓ డాక్టర్ OLX ప్లాట్ఫామ్లో తన ఎలక్ట్రిక్ కుర్చీని అమ్మకానికి పెట్టాడు.
అది చూసిన ఓ సైబర్ కేటుగాడు జితేంద్ర శర్మ పేరుతో డాక్టర్కు ఫోన్ చేశారు. కుర్చీని కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని నమ్మించాడు. కుర్చీ కొనుగోలుకు సంబంధించిన డబ్బు పంపేందుకుగాను తన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయాలని డాక్టర్కు చెప్పాడు.
అతడి మాటలు నమ్మి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేశాడు. అంతే క్షణాల వ్యవధిలోనే అతని ఖాతా నుంచి రూ.2.58 లక్షలు మాయమయ్యాయి. తన అకౌంట్లో జీరో బ్యాలన్స్ ఉన్నట్లు మెసేజ్ రావటంతో తాను మోసపోయినట్లు గ్రహించి వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు విచారణ చేపట్టారు.