నిర్మల్ మున్సిపల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు నిర్మల్ బంద్కు బీజేపీ పిలుపునిచ్చింది. నిర్మల్లో నూతన మాస్టర్ ప్లాన్ అమలుకు వ్యతిరేకంగా బిజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేస్తున్న దీక్షకు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మద్దతు తెలిపారు. BRS నేతలు తక్కువ ధరకు భూములు కొన్నారని, ఇండస్ట్రియల్ జోన్ ఎత్తేసి కమర్షియల్ జోన్ చేశారని ఆరోపించారు. మాస్టర్ ప్లాన్తో రైతులను ముంచారని ఈటల విమర్శించారు.
ఈ సందర్బంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. కేసీఆర్ వచ్చాక కొత్తరూపం ఎత్తారని .. భూములు అమ్ముకొని బ్రోకర్ గా మారారని ప్రజలు అనుకుంటున్నారన్నారు. జోన్ కన్వర్ట్ చెయ్యడం.. అసైన్డ్ భూములు లాక్కోవడం.. పరిశ్రమల పేరుతో భూములు సేకరించడం పేరుతో కేసీఆర్ భూములు పేదవారి చేతిలో లేకుండా చేస్తున్నారు అని ఆయన ఆరోపించారు. అభివృద్ధి , మాస్టర్ ప్లాన్ , ధరణి పేరుతో భూములు లూటీ చేస్తున్నారని ఆరోపించారు. పాత ఏరియాకే ఇండస్ట్రీలు రానప్పుడు కొత్త మాస్టర్ ప్లాన్స్ ఎందుకని ప్రశ్నించారు. గ్రీన్ బెల్ట్ కింద ఉన్న భూములను 220 జీవో తెచ్చి రైతుల కళ్లల్లో మట్టి కొడుతున్నారని మండిపడ్డారు.