పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. గ్రామ శివారులోని గుట్టలలో నిన్న ఒక లేగ దూడని లాక్కెళ్లిన సంఘటన చూసిన గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. చిరుత తిరుగుతుందన్న గ్రామస్తుల సమాచారం మేరకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ స్వాతి సోమవారం ఆ ప్రాంతాన్ని సందర్శించారు.
అక్కడ చిరుత ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. రైతులు ఒంటరిగా పొలాల వైపు వెళ్లవద్దని, అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనవసరంగా గుట్ట వైపు వెళ్లకూడదని తెలిపారు. ఆవుల మందని కొద్దిరోజులు ఇంటి దగ్గరే మేపడం మంచిదని పేర్కొన్నారు.