సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఇస్రో చేపట్టిన PSLV-C57 ఆదిత్య L1 ప్రయోగానికి కౌంట్డౌన్ ప్రారంభమైంది. 24 గంటల అనంతరం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది. రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్వహించనున్నారు. 1,470 కేజీల బరువున్న ఆదిత్య L1 ఉపగ్రహాన్ని భూమి నుంచి సూర్యుడి దిశగా 15లక్షల కి.మీ దూరంలో ఉన్న లాగ్రాంజ్ కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది. గ్రహణాలతో సంబంధం లేకుండా ఇది సూర్యుడిని అధ్యయనం చేయనుంది.
కరోనాతో పాటు సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాల ప్రభావంపై ఇస్రో పరిశోధనలు చేస్తుంది. సౌర మండలంలోని గాలులపై కూడా అధ్యయనం జరుగుతుంది. ఇప్పటికే బెంగళూరులోని యూఆర్ రావ్ సాటిలైట్ సెంటర్ (URSC) నుంచి ఉపగ్రహాన్ని శ్రీహరి కోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ కు తీసుకొచ్చారు.