ఢిల్లీలో గుర్తు తెలియని దుండగులు ఇద్దరిపై కాల్పులు జరిపారు. ఈ ఘటన ఢిల్లీలోని భజన్పురలో చోటు చేసుకుంది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ లో సీనియర్ మేనేజర్ గా పనిచేస్తున్న హర్ప్రీత్ గిల్ (36) అనే వ్యక్తి తన మేనమామతో కలిసి భజన్పురలోని సుభాష్ విహార్కు వెళ్తుండగా బైక్ పై వచ్చిన దుండగులు అడ్డుకుని వారిపై కాల్పులు జరిపి పరారయ్యారు.
స్థానికులు గమనించి లోక్ నాయక్ జై ప్రకాశ్ ఆస్పత్రికి తరలించారు. గిల్ అప్పటికే మృతి చెందాడని, గిల్ మేనమామ చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. గిల్ తల కుడి వైపు నుంచి చెవి వెనుక భాగంలోకి బుల్లెట్ ప్రవేశించి వెళ్లిపోయిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జాయ్ టిర్కీ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దాడి చేసిన వారిని గుర్తించేందుకు సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.