గోదావరి జిల్లాల్లో ఫేమస్ అయిన పులస చేప(FISH) కోసం జనాలు ఎదురు చూస్తుంటారు. తొలకరి మొదలైతే చాలు గోదావరికి ఎర్ర నీరు వస్తుంది.. దీంతో పులసల సీజన్ మొదలైనట్లే అని చెబుతుంటారు. గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది పులసలు కాస్త తక్కువనే చెప్పాలి. దొరికిన ఒకటి, రెండు కేజీల చేపలు మార్కెట్లోకి వస్తున్నాయి. గత నెలలో ఎప్పుడో ఒకటి రెండుసార్లు చేపలు చిక్కితే.. మళ్లీ 15 రోజుల తర్వాత పులస మత్స్యకారుల వలకు దొరికింది. కాకినాడకు సమీపంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో ఈ పులస చిక్కింది.
ఈ పులస చేప( fish)ధర:
అత్యంత రుచికరమైన చేపగా పేరుకెక్కిన పులస మళ్లీ రికార్డు స్థాయి ధర పలికింది. నిన్న సాయంత్రం యానాం పుష్కరఘాట్ వద్ద ఓ మత్స్యకారుడి వలకు చిక్కిన పులస అతడి పంట పండించింది. రెండు కిలోల బరువున్న ఈ చేపను వేలం వేయగా నాగలక్ష్మి అనే మహిళ రూ. 19 వేలకు కొనుగోలు చేశారు.
ఆ తర్వాత రావులపాలేనికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు కోసం ఓ వ్యక్తి ఆమె నుంచి రూ. 26 వేలకు కొనుగోలు చేశాడు. ఈ సీజన్లో పులసకు ఇంత ధర పలకడం ఇదే తొలిసారి. గోదావరికి ఎదురీదే పులస అత్యంత రుచికరంగా ఉంటుందని చెబుతారు. దీనికి తోడు ఈ సీజన్లో మాత్రమే దొరికే ఈ చేపను కొనేందుకు పోటీపడుతుంటారు.
ఈ పులస చేప( fish) సుదూర ప్రాంతాల నుంచి బంగాళాఖాతంలోకి వస్తుందట.. గోదావరికి ఎర్ర నీరు వచ్చిన సమయంలో ఈ చేప అతి వేగంగా ఎదురీదుతుందని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ చేపలు సంతానోత్పత్తి కోసం టాంజానియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి సుదూర ప్రాంతాల నుంచి ఖండాలను దాటి వస్తాయి అంటున్నారు. ఆశాఢ, శ్రావణ మాసాల్లో ఇక్కడే ఉండి.. మళ్లీ సముద్రంలోకి తిరిగి వెళ్లిపోతాయట.