Weather Report :
దేశంలో రానున్న మూడు రోజుల్లో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీతో 19 రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పశ్చిమ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్లో కుండపోత వానలు పడే సూచనలున్నాయంటూ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్లో భారీ వర్షాలు పడుతాయని, దేశంలోని తూరు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ముంబయిలో గురువారం భారీ వర్షాలకు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి.
ఢిల్లీ :-
జీ20 సమావేశాలు జరుగుతున్న ఢిల్లీ లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సదస్సు వేదికైన భారత్ మండపం చుట్టూ సెప్టెంబర్ 10, 11 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని సెప్టెంబర్ 9-11 తేదీల మధ్య ఉష్ణోగ్రతలు 35-39 డిగ్రీల, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 26-28 మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తుంది.
తెలంగాణ :-
ఈరోజు ఉదయం ఆకాశం మేఘావృతమై ఉన్న హైదరాబాద్లో మరికొన్ని గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ తెలిపింది.
ఖచ్చితమైన వాతావరణ అంచనాలకు పేరు గాంచిన IMD ప్రకారం, హైదరాబాద్లో మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు అయిన వర్షాలు కురుస్తాయని అంచనా.
అయినప్పటికీ ఇది నిరంతర వర్షపాతం కాదని జల్లులతో కూడిన వర్షం అని వెల్లడించారు.
తెలంగాణలోని ఇతర జిల్లాలకు కూడా సాయంత్రం వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.
హాంకాంగ్ :-
ఆర్థిక కేంద్రమైన హాంకాంగ్, దక్షిణ చైనాలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. హాంకాంగ్ మహానగరం 140 ఏళ్లలో ఈ స్థాయి కుంభవృష్టి చూడలేదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
దీంతో అతి పెద్ద వర్షపాత హెచ్చరిక ‘బ్లాక్’ను గురువారం సాయంత్రమే జారీ చేశారు.
శుక్రవారం ఉదయానికి వీధులు, సబ్ వేలు నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 75 లక్షల మంది వరద బారిన పడగా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.