ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలతో రైతు ఆత్మహత్యలు(Farmer suicides) లేని రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
సోమవారం GWMC పరిధిలోని వసంతాపుర్, స్తంబంపల్లి గ్రామాల్లో రూ.3 కోట్ల 50లక్షలతో గ్రామాల్లో పూర్తయిన సీసీ రోడ్లు, సైడు కాల్వలు, బిటి రోడ్లు ఎమ్మెల్యే ప్రారంభం చేశారు.
అదేవిధంగా అకాల వర్షాలకు పంటనష్టపోయిన 590 మంది రైతులకు గాను రూ.79 లక్షల 80 వేల విలువచేసే చెక్కులను పంపిణీ చేశారు.
రైతుల ఆత్మహత్య(Farmer suicides)లను ఎలా అరికట్టారని..
ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ..ఉమ్మడి ఏపీలో నిత్యం రైతు ఆత్మహత్యలు (Farmer suicides) చేసుకుంటున్నట్టు జాతీయ స్థాయిలో నాయకులు అవహేళన చేసేవారని, ఇప్పుడు తెలంగాణలో ఏ అద్భుతం జరిగింది? రైతుల ఆత్మహత్యలను ఎలా అరికట్టారని ఆశ్చర్యపోతూ.. కితాబునిస్తున్నారని అన్నారు.
ప్రభుత్వ సూచన మేరకు రైతులు డిమాండ్ ఉన్న పంటలు పండించడం ద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఎక్కువ ఉందని తెలిపారు.
నియంత్రిత వ్యవసాయ సాగుపై రైతులకు అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలని అన్నారు.
రైతులకి అండగా ఉండడానికి, రైతులకు భరోసాగా గ్రామస్థాయి నుండి రాష్ట్రస్ధాయి వరకు రైతుబంధు సమీతీలు సీఎం కేసీఆర్ నియమించారని అన్నారు.
కేసీఆర్ వస్తే ప్రజలే పాలకులుగా మారుతారు..
రాష్ట్రంలో మూడు పంటలు పండేందుకు నిరంతర నాణ్యమైన విద్యుత్ను ఇచ్చే సీఎం కేసీఆర్ కావాలో, మూడు గంటల కరెంటు చాలు అనే కాంగ్రెస్ కావాలో ప్రజలు ఆలోచించాలన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తే వ్యవసాయం దండుగై మళ్లీ వలసలు పెరుగుతాయని, వ్యవసాయాన్ని పండుగ చేసిన కేసీఆర్ వస్తే ప్రజలే పాలకులుగా మారుతారని అన్నారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడిన రైతుబంధు సమీతీలు అండగా ఉంటాయన్నారు. రానున్న రోజుల్లో రైతులకు అండగా నిలిచేందుకు రైతుబంధు సమితిలు కీలకం కానున్నాయన్నారు.
ఒకే రకమైన పంటలు వేయకుండా వ్యవసాయ అధికారుల సూచన మేరకు వివిధ రకాల పంటలు, అంతర పంటలు సాగు చేసి లాభాలను రైతులు పొందాలని సూచించారు.
సీఎం కేసీఆర్ ఆసియాలోనే అతి పెద్ద బాహుబలి ప్రాజెక్టు అయిన కాళేశ్వరం నిర్మించి లక్షలాది ఎకరాలకు సాగు జలాలు అందించినట్టు చెప్పారు. మంచి చేసిన నాయకుడు సీఎం కేసీఆర్ మళ్లీ గెలువడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
ఇవ్వాళ దేశానికి తెలంగాణ రాష్ట్రం దిస్సూచిగా నిలిచింది. కాంగ్రెస్ 60 ఏండ్లు పాలించినప్పుడు ఇలా ఎందుకు చేయలేదో ప్రజలకు చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపుతున్నదని విమర్శించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, బి.ఆర్.ఎస్.నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.