తెలంగాణలో డిగ్రీ విద్యలో సంస్కరణల పర్వం కొనసాగుతూనే ఉంది. సైబర్ నేరాలను అరికట్టడం, వాటిని సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా ఉన్నత విద్యలో కొత్తగా సైబర్ సెక్యూరిటీ కోర్సు (Cyber Security Course) అందుబాటులోకి వచ్చింది.
ఇప్పటికే ప్రవేశ విధానం, కొత్త కోర్సులు, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, ఇంటర్న్షిప్స్ తదితర మార్పులు ప్రవేశ పెట్టిన ఉన్నత విద్యా మండలి కొత్తగా సైబర్ సెక్యూరిటీ కోర్సు (Cyber Security Course) ను తీసుకొచ్చింది.
సైబర్ సెక్యూరిటీ పేరిట రూపొందించిన ఈ కోర్సును సోమవారం హైదరాబాద్ మాసబ్ట్యాంక్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ,
ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి తదితరులతో కలిసి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.
ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే డిగ్రీలో నూతన కోర్సులను ప్రవేశపెట్టనున్నారు.
ఇకపై ప్రతి విద్యార్థి సైబర్ సెక్యూరిటీ కోర్సు ను అదనంగా చదవాల్సి ఉంటుంది.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉన్నత విద్యలో సమూలమైన మార్పులు తీసుకురావాలన్న సీఎం కేసీఆర్ ఆకాంక్షకు అనుగుణంగా ఈ విద్యా సంవత్సరం నుంచే డిగ్రీ సెకండియర్లో సైబర్ సెక్యూరిటీ నూతన కోర్సును ప్రవేశ పెడుతున్నామని తెలిపారు.
30 శాతం ప్రజలు ఏదో ఒక సైబర్ క్రైమ్ బారిన పడుతున్నారని చెప్పారు. ఫేక్ సర్టిఫికెట్లను అరికట్టేందుకు స్టూడెంట్ అకడమిక్ వెరిఫికేషన్ సిస్టం (ఎస్ఏవీఎస్)ను ప్రవేశ పెట్టారు.
ఇది విజయవంతంగా సేవలు అందిస్తున్నదని తెలిపారు. సైబర్ సెక్యూరిటీ కోర్సు విద్యార్థులను సైబర్ యోధులుగా తయారు చేస్తుందని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో పోలీసు శాఖ అదనపు డీజీ సంజయ్ కుమార్ జైన్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు వెంకటరమణ, ఎస్కే మహమూద్, పలు వర్సిటీల వీసీలు విజ్జులత, రవీందర్, గోపాల్రెడ్డి, పలు వర్సిటీల ఆచార్యులు పాల్గొన్నారు.
ఐఎస్బీ నుంచి ఆచార్య చంద్రశేఖర్ శ్రీపాద, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆచార్య గరిమ మాలిక్ హాజరై ఐఎస్బీ అధ్యయనం చేసిన అసెస్మెంట్, ఎవాల్యుయేషన్ సిస్టం నివేదికను సమర్పించారు.
సమావేశంలో డిగ్రీలో చేపట్టబోయే సంస్కరణలు నూతన కోర్సులు ఇతర అకాడమిక్ అంశాలపై చర్చించారు.
ఎక్కువ సంఖ్యలో డిగ్రీ కళాశాలల్లో నైపుణ్య ఆధారిత కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. బీఎస్సీ(B.SC) కంప్యూటర్ కోర్సునూ ప్రారంభిస్తారు.
డిగ్రీ చదివే ప్రతి విద్యార్థీ వాల్యూ అడిషన్లో భాగంగా సైబర్ సెక్యూరిటీ కోర్సును నాలుగు క్రెడిట్లుగా చదవాల్సి ఉంటుంది. ప్రధాన కోర్సులతో పాటు దీన్ని అదనంగా చదవాలి.
సైబర్ సెక్యూరిటీ కోర్సును డిగ్రీ సెకండియర్లో నాలుగో సెమిస్టర్ లోని బీఏ, బీకాం, బీఎస్సీ వంటి అన్ని రకాల కోర్సుల విద్యార్థులు ఈ కోర్సును పూర్తి చేయాల్సిందే.