అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, నిరుద్యోగులకు గరిష్ట లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో APPSC Group 2 (ఏపీపీఎస్సీ గ్రూప్ 2) లో 212 అదనపు పోస్టులను పెంచుతూ ప్రభుత్వం జీవో ను విడుదల చేసినట్లు ప్రకటించారు. ఈ ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆధారంగా భర్తీ చేయాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో ఉంది.
గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రూప్-2 లో 508 పోస్టుల భర్తీకి జీవో జారీ చేసినప్పటికీ, ప్రస్తుతం పోస్టుల సంఖ్యను పెంచాలని నిరుద్యోగులు కోరగా, సీఎం సానుకూలంగా స్పందించి జీవో ను విడుదల చేసినట్లు తెలిపారు. సీఎం జగన్ ఆదేశాలతో మరోసారి అన్ని శాఖల్లో ఖాళీల వివరాలను తీసుకొచ్చిన GAD పరీక్షల అనంతరం 212 అదనపు పోస్టులను పెంచుతున్నట్లు తెలిపారు.
త్వరలో APPSC Group 2 నోటిఫికేషన్ విడుదల
APPSC త్వరలో మొత్తం 720 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయన్నట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని పలు విభాగాల్లో ఖాళీల భర్తీకి ఆగస్టు నెలలోనే ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించుకుంది. గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుంది.
మొత్తం 597 పోస్టులను APPSC ద్వారా భర్తీ చేసేందుకు ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేయగా, వీటిల్లో 89 గ్రూప్-1 పోస్టులు, 508 గ్రూప్-2 పోస్టులు ఉన్నాయి. గ్రూప్-1 విభాగంలో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ కేటగిరీ-II, అసిస్టెంట్ కమిషనర్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులతో సహా పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.
APPSC Group 2 కేటగిరీ కింద డిప్యూటీ తహసీల్దార్లు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-III, సబ్ రిజిస్ట్రార్ తో పాటు మరికొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తారు. తాజాగా గ్రూప్-2 లో అదనంగా 212 పోస్టులను పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసిన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ఏపీపీఎస్సీ సర్వం సిద్ధం చేస్తుంది.