Home   »  జాతీయం   »   Dogs Attack: రేబిస్‌తో ప్రాణాలు కోల్పోయిన 8 ఏళ్ల చిన్నారి..

Dogs Attack: రేబిస్‌తో ప్రాణాలు కోల్పోయిన 8 ఏళ్ల చిన్నారి..

schedule ranjith

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో విషాద ఘటన వెలుగుచూసింది. కుక్కలు కాటుకు గురయ్యిన 8 ఏళ్ల బాలికకు ఇంటి వద్దే నాటువైద్యం అందించడంతో ప్రాణాలు విడిచింది.

Dogs Attack కుక్క కరిచాక హాస్పిటల్‌కు తీసుకెళ్లని వైనం

కుక్కలు కరిచిన 15 రోజుల తర్వాత రేబిస్‌తో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆగ్రా జిల్లా పినహత్‌ పట్టణానికి సమీపంలోని ఓ గ్రామంలో రెండు వారాలక్రితం ఓ గ్రామంలో ఆడుకుంటున్న సమయంలో బాలిక పై వీధి కుక్కలు దాడి (Dogs Attack) చేశాయి. బాలిక మృతిపై ఆగ్రా చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఏకే శ్రీవాస్తవ వివరాలు తెలిపారు. బాలిక కుక్కలు కరిచిన విషయాన్ని తన తల్లికి తప్ప ఇంకెవరికీ చెప్పలేదు. హాస్పిటల్‌కు తీసుకెళ్లి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ (ARV) ఇప్పించకుండా ఇంటి వద్దే ఉంచి నాటు వైద్యాన్ని అందించారని తెలిపారు.

రేబిస్ లక్షణాలు కనిపించాక తీసుకెళ్లినా దక్కని ప్రయోజనం

బాలికకు 15 రోజుల తర్వాత రేబిస్ లక్షణాలు కనిపించడంతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారని శ్రీవాస్తవ వెల్లడించారు. బాలిక పరిస్థితి ఆందోళనకరంగా మారిన తర్వాత ఆస్పత్రికి తీసుకొచ్చారని, తీవ్రత గుర్తించి మెరుగైన వసతులున్న హాస్పిటల్ తరలించే క్రమంలో మార్గమధ్యంలోనే బాలిక ప్రాణాలు కోల్పోయిందని వివరించారు. రేబిస్‌ వ్యాధికి 100 శాతం మరణాల రేటు ఉందని హెచ్చరించిన ఆయన.. కుక్కలు కరిస్తే ఏమాత్రం అలసత్వం చేయకుండా హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని సూచించారు. కుక్కలు కరిచిన 24 గంటల్లోగా ARV మొదటి డోస్ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు.

Also Read: Uttar Pradesh: పెళ్లి అయిన 3వ రోజే యువకుడు ఆత్మహత్య..