తిరుపతి: తిరుపతిలో ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) దాడులు కలకలం రేపాయి. రియల్ ఎస్టేట్ సంస్థ చైర్మన్, డాలర్స్ గ్రూప్ చైర్మన్ దివాకర్ రెడ్డి కార్యాలయంతో పాటు ఆ గ్రూపుతో సంబంధం ఉన్న బంధువుల ఇళ్లపై IT అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.
ప్రకటిత ఆదాయానికి మించి ఆస్తులు ఉండవచ్చన్న సమాచారం మేరకు సోదాలు నిర్వహిస్తున్నారు. చైర్మన్, ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లను స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు ప్రస్తుతం లభించిన పత్రాలను పరిశీలిస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతల ఇళ్లలో Income Tax దాడులు
కాగా, తెలంగాణలో కాంగ్రెస్ నేతలు, వారి బంధువుల ఇళ్లలో గురువారం ఉదయం ప్రారంభమైన సోదాలు రాత్రి వరకు సాగాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, ఆయన కుమారుడు జయవీర్ నివాసంలో గురువారం రాత్రి తనిఖీలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ తనిఖీలు సాధారణ విధివిధానాల్లో భాగమని, ఈ సందర్భంగా ఐటీ అధికారులు కొన్ని పత్రాలను పరిశీలించారని చెప్పారు.
గురువారం కూడా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (KLR) ఇళ్లు, విల్లాలు, ఫాంహౌస్లపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. బడంగ్పేట మేయర్, పీసీసీ నేత చిగురింత పారిజాత నర్సింహారెడ్డి ఇళ్లతో పాటు బాలాపూర్లోని వారి బంధువులు, అనుచరుల ఇళ్లలోనూ సోదాలు చేశారు. శుక్రవారం మరోసారి కేఎల్ఆర్ నివాసం, కార్యాలయాల్లో తనిఖీలు జరిగాయి.