హైదరాబాద్: ఓటరుకు రూ.లక్ష రూపాయలు ఇవ్వజూపిన కేసులో నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ (Feroze Khan)పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రధానాంశాలు
ఓటరుకు రూ.లక్ష ఆఫర్ చేశారన్న ఆరోపణలపై ఫిరోజ్ ఖాన్ పై FIR నమోదు
తెలంగాణ శాసనసభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరుగనుంది. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో గెలుపు కోసం పలు పార్టీల నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు.
ఓటర్లకు డబ్బు ఎరచూపి ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ (Feroze Khan) పై తాజాగా హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసారు. ఓటరుకు రూ.లక్ష ఆఫర్ చేశారన్న ఆరోపణలపై పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయడం జరిగింది. సెక్షన్ 171 సి, 188, 123 ఆర్పీ యాక్ట్ కింద కేసులు బుక్ చేయడం జరిగింది.
Feroze Khan ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు, IT అధికారులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ ఇంట్లో పోలీసులు, IT అధికారులు మంగళవారం రాత్రి సోదాలు నిర్వహించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకటించినప్పటి నుంచి హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో ఆదాయపు పన్ను శాఖ (IT) దాడులు నిర్వహిస్తోంది. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీసులు ప్రజా, రాజకీయ నేతల వాహనాలను కూడా సోదాలు చేస్తున్నారు.
ఫిరోజ్ ఖాన్ నివాసంలో నిన్న జరిగిన సోదాల గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు రంగం సిద్ధమైంది. రేపు గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యి సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. సమయం ముగిసిన తర్వాత కూడా క్యూలో ఉన్నవారు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.
విద్యా సంస్థలకు నేడు, రేపు సెలవులు ప్రకటించిన EC
ఎన్నికల అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. మరోవైపు పోలింగ్ దృష్ట్యా హైదరాబాద్లోని విద్యా సంస్థలకు నేడు, రేపు సెలవు ప్రకటించడం జరిగింది. ఇక ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ఐటీ కంపెనీలు ఎన్నికల రోజున ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేసారు.
తెలంగాణలో మొత్తం 119 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరగబోతుంది. 2290 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా 19,375 ప్రాంతాల్లో మొత్తం 35,356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్ర బలగాలు ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు.
Also Read: ప్రచారంలో ఘర్షణ… కాంగ్రెస్, AIMIM కార్యకర్తలపై FIR నమోదు