ENG VS IND: ముంబై DY పాటిల్ స్టేడియం వేదికగా ఇంగ్లండ్ మహిళలతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత మహిళా క్రికెట్ జట్టు సంచలనం సృష్టించింది. తొలుత బ్యాటింగ్ తో ఆకట్టుకున్న టీమ్ ఇండియా ఆ తర్వాత బంతితో మరింత విజృభించింది.
ప్రధానాంశాలు
దీప్తి శర్మ (5/7) మ్యాజిక్తో 136 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్
బౌలర్ దీప్తి శర్మ (5/7) మ్యాజిక్తో ఇంగ్లండ్ 136 పరుగులకే ఆల్ ఔట్ అయ్యింది. దీంతో టీమిండియా 292 పరుగుల ఆధిక్యంలోకి వెళ్లింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 428 పరుగులు చేసింది. ఆరంభం నుంచే ఇంగ్లండ్పై భారత బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. ఇంగ్లాండ్ ఓపెనర్ డంక్లీ (11)ని రేణుకా సింగ్ క్లీన్ బౌల్డ్ చేసింది. వెంటనే ఆ జట్టు కెప్టెన్ హీథర్ (11)ను పూజా పెవిలియన్ కు పంపింది.
ENG VS IND 5.3 ఓవర్లు వేసి, ఏడు పరుగులిచ్చి ,ఐదు వికెట్లు పడగొట్టిన దీప్తి శర్మ
ఆ తర్వాత నాట్ సివర్ (59) బ్యూమాంట్ (10)తో కలిసి ఇన్నింగ్స్ను సెటిల్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ పూజ అద్భుత ఫీల్డింగ్తో బ్యూమాంట్ ను రనౌట్ చేసింది. ఆ తర్వాత ఇంగ్లండ్ జట్టుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా భారత బౌలర్లు వరుస వికెట్లు పడగొట్టారు. దీప్తి శర్మ స్పిన్ ధాటికి ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ పెవిలియన్ కు క్యూ కట్టారు. దీప్తి 5.3 ఓవర్లు వేసి ఏడు పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసింది.
ఏకైక టెస్టులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత్
10 పరుగుల వ్యవధిలో ఇంగ్లండ్ (ENG VS IND) జట్టు చివరి ఆరు వికెట్లు నష్టపోయింది. భారత బౌలర్లలో దీప్తి ఐదు వికెట్లు తీయగా, స్నేహ రెండు, రేణుక, పూజ తలో వికెట్ దక్కించుకున్నారు. అంతకుమందు టీమ్ ఇండియా రెండో రోజు ఆట ప్రారంభించిన కొద్దిసేపటికే లారెన్ బెల్ బౌలింగ్ లో భారత్ దీప్తి శర్మ (67) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వరుసగా రేణుకా సింగ్ (1), గైక్వాడ్ (0)లు కూడా ఔటయ్యారు.
ఈ రోజు ఆటలో భారత బ్యాట్స్మెన్ పది ఓవర్లు మాత్రమే క్రీజులో వున్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ బెల్ తలో మూడు వికెట్లు, కేట్ క్రాస్, నాట్ సివర్, చార్లీ డీన్ తలో వికెట్ దక్కించుకున్నారు. టీమిండియా బ్యాట్స్మన్లలో సతీష్ శుభ (69), జెమీమా రోడ్రిగ్స్ (68), దీప్తి శర్మ (67), యాస్తిక భాటియా (66) అర్ధ సెంచరీలతో రాణించారు. హర్మన్ప్రీత్ కౌర్ 49 పరుగుల వద్ద రనౌట్ అయ్యింది.