హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు. సాగునీటి రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పారదర్శకంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. వ్యవసాయం, నీటిపారుదల రంగంపై ముఖ్యమంత్రి తన నివాసంలో నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్కుమార్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ప్రధానాంశాలు
ప్రాజెక్టుల వివరాలను ప్రజలకు చెప్పకుండా దాచి పెడితే కఠిన చర్యలుంటాయి:CM Revanth Reddy
1956 నుంచి 2014 వరకు, 2014 నుంచి 2023 మధ్య కాలంలో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం, కొత్త ఆయకట్టుల ఏర్పాటుపై అధికారుల నుంచి సీఎం వివరాలు కోరారు. మార్గదర్శకాల వివరాలను ప్రజలు పొందాలని సీఎం సూచించారు. అన్ని ప్రాజెక్టుల గణాంకాలను సమగ్రంగా రూపొందించాలని రేవంత్ స్పష్టం చేశారు. ప్రాజెక్టుల వివరాలను ప్రజలకు చెప్పకుండా దాచిపెడితే కఠిన చర్యలుంటాయని సీఎం అధికారులను హెచ్చరించారు.
నిర్ణయాలను, వాస్తవాలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలి: CM
ప్రతి అంశంలోనూ పారదర్శకత ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి నిర్ణయాన్ని బహిరంగంగా ప్రకటిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. పారదర్శకత పాటించడంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నిర్ణయాలను, వాస్తవాలను ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం కోరారు.
సాగునీటి ప్రాజెక్టులపై సవివరమైన నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలి: CM
ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టు పనుల స్థితి గతులతో పాటు సాగునీటి ప్రాజెక్టులపై సవివరమైన నివేదికను రూపొందించి వీలైనంత త్వరగా ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రఘునందన్రావు, శేషాద్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ALSO READ: నేడు హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద ‘I.N.D.I.A’ కూటమి ధర్నా..