City of Dwarka | పురాతన ఆధ్యాత్మిక నగరం ద్వారకను వీక్షించేందుకు ప్రధాని మోదీ అరేబియా సముద్రంలో స్కూబా డైవింగ్ చేశారు. సముద్ర గర్భాన నిక్షిప్తమైన ద్వారక మహా నగరాన్ని దర్శించుకొని పూజలు చేశారు.
ప్రధానాంశాలు
ద్వారక: అరేబియా సముద్రంలో ప్రధాని మోదీ స్కూబా డైవింగ్ చేసి హిందువుల పురాతన ఆధ్యాత్మిక నగరమైన ద్వారక వద్ద పూజలు నిర్వహించారు. గుజరాత్లోని ద్వారక పట్టణం తీరంలోని పంచకుయ్ బీచ్ నుంచి ప్రధాని మోదీ స్కూబా డైవింగ్ ద్వారా సముద్రపు అడుగుభాగానికి చేరుకున్నారు.
City of Dwarka లో మోదీ ప్రత్యేక పూజలు
ద్వారకాలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అక్కడ కాసేపు గడిపారు. “సముద్ర గర్భంలో దేవుడిని ఆరాధించడం ఒక అద్భుతమైన అనుభూతి! ఇది దేవుని సన్నిధిలో గడపడం లాంటిది” అన్నారు. ప్రధాని మోదీ తెల్లటి డైవింగ్ హెల్మెట్ ధరించి నేవీ సిబ్బంది సాయంతో స్కూబా డైవింగ్ చేస్తూ సముద్రగర్భానికి చేరుకున్నారు.
ద్వారకాలో కృష్ణుడికి పూజలు చేసి నెమలి పింఛాన్ని అందజేశారు. తర్వాత తన అనుభవాన్ని, ఫొటోలను ప్రధాని ‘X’లో పోస్ట్ చేసారు. అనంతరం గుజరాత్లో జరిగిన సభలో మాట్లాడారు. సముద్రంలో ఉన్న పురాతన ద్వారక నగరాన్ని తాకగానే 21వ శతాబ్దపు సుసంపన్నమైన భారతదేశ చిత్రం తన కళ్ల ముందు మెరిసిందన్నారు.
ద్వారకను సందర్శించాలనేది మోదీ దశాబ్దాల కల
సముద్ర గర్భంలో ఉన్న ద్వారక దర్శనం దేశాభివృద్ధికి తన సంకల్పాన్ని బలపరిచిందని వివరించారు. ఆధ్యాత్మిక వైభవం యొక్క పురాతన కాలంతో తాను లీనమైపోయానని ప్రధాని వ్యాఖ్యానించారు. పురాతన నగరమైన ద్వారకను సందర్శించాలన్న తన దశాబ్దాల కల నెరవేరిందని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. గుజరాత్లోని ద్వారక తీర పట్టణంలోని శ్రీకృష్ణుని ఆలయంలో కూడా మోదీ ప్రార్థనలు చేశారు.
Also Read: రేపు గుజరాత్లో సుదర్శన్ సేతును ప్రారంభించనున్న ప్రధాని మోదీ..!