Spot valuation centers | ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని (స్పాట్ వాల్యూయేషన్) తెలంగాణ ఇంటర్ బోర్డు మరింత కట్టుదిట్టంగా నిర్వహిస్తోంది. తాజాగా స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాల్లోకి అధ్యాపకుల ఫోన్లను అనుమతించబోమని తెలిపింది. గతంలో ఫోన్లను అనుమతించడం వల్ల సమస్యలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ప్రధానాంశాలు
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు పూర్తి కావడంతో విద్యార్ధుల జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభించారు. ఇంటర్ జవాబుపత్రాల స్పాట్ వాల్యూయేషన్ను (Spot valuation centers) ఇంటర్ బోర్డు మరింత కట్టుదిట్టంగా నిర్వహిస్తోంది. తాజాగా వాల్యూయేషన్ కేంద్రాల్లోకి అధ్యాపకుల ఫోన్లను అనుమతించకూడదని ఆదేశించింది.
Spot valuation centersలో నిఘా వ్యవస్థ పటిష్టం
గతంలో ఫోన్లను అనుమతించడం వల్ల తలెత్తిన సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాల్లోకి ప్రవేశించే ముందు అధ్యాపకులు తమ ఫోన్లను డిపాజిట్ చేయాలని బోర్డు స్పష్టం చేసింది. దీంతో పాటు స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాల్లో నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. మూల్యాంకనం చేసే సమయంలో బయటి వ్యక్తులతో ఎలాంటి సంబంధాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
సమాధాన పత్రాలు తీసుకున్న దగ్గర్నుంచి, తిరిగి సంబంధిత అధికారికి అందించేవరకు హాలులోనే ఉండాలని, హాలు దాటి బయటకు వెళ్లిన ప్రతిసారీ రిజిస్టర్లో నమోదు చేయాలని బోర్డు అధ్యాపకులకు సూచించింది. అధ్యాపకులు చేసే మూల్యాంకన పత్రాల వివరాలు ఎప్పటికప్పుడు రాష్ట్ర కార్యాలయానికి అందేలా ఏర్పాట్లు చేసినట్టు సంబంధిత అధికారులు తెలిపారు.
ఒక్కొక్కరికి రోజుకు 30 పేపర్లు మాత్రమే
ఈ ఏడాది 10 లక్షలకు పైగా విద్యార్థులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలు రాశారు. వాల్యూయేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 16 కేంద్రాల్లో 20 వేల మంది అధ్యాపకులు వాల్యూయేషన్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. నాణ్యమైన మూల్యాంకనం కోసం ఒక్కొక్కరికి రోజుకు 30 పేపర్లు (ఉదయం 15 పేపర్లు, సాయంత్రం 15 పేపర్లు) మాత్రమే ఇస్తున్నారు. గతంలో ఎలాంటి ఆరోపణలు లేని ప్రభుత్వ అధ్యాపకులతో పాటు, ఇంటర్ బోర్డు గుర్తింపు పొందిన ప్రైవేటు కాలేజీల అధ్యాపకులను వాల్యూయేషన్ కోసం ఎంపిక చేశామని అధికారులు చెబుతున్నారు.
Also Read: TS TET Fee | టెట్ ఫీజు తగ్గించేందుకు ప్రభుత్వం యోచన..?