సబ్ మెరైన్–టైటానిక్: శతాబ్దం కిందట సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ ను చూసేందుకు వెళ్లిన సబ్ మెరైన్ జలాంతర్గామి గల్లంతయ్యింది. అట్లాంటిక్ మహా సముద్రంలో ఆచూకీ లేకుండా పోయింది. ప్రమాద సమయంలో సదరు జలాంతర్గామిలో ముగ్గురు పర్యాటకులతో పాటు ఇద్దరు సిబ్బంది ఉన్నారని సమాచారం. జలాంతర్గామితో కమ్యూనికేషన్ కట్ అయిన విషయం తెలియడంతో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి.
అమెరికా, కెనడాలకు చెందిన కోస్ట్ గార్డ్ లతో పాటు నేవీ సబ్ మెరైన్ లు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇందులో బిలియనీర్లు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్ ప్రముఖులు ఉన్నట్లు తేలింది. దీనిలో పాక్లోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన షాజాదా దావూద్, ఆయన కుమారుడు సులేమాన్ ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు ఈ మినీ జలాంతర్గామిని నిర్వహిస్తున్న ఓషన్గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్ కూడా యాత్రికుల్లో ఉన్నట్లు తేలింది. వీరితోపాటు UK-UAE బిలియనీర్ హమీష్ హార్డింగ్, ఫ్రాన్స్కు చెందిన పైలట్ పౌల్ హెన్రీ నార్జియోలెట్ కూడా ఉన్నారు. ఓషన్ గేట్ చేపట్టిన ఎనిమిది రోజుల సాహస యాత్రలో టైటానిక్ శకలాల సందర్శన కూడా ఓ భాగం. న్యూఫౌండ్లాండ్ నుంచి ఈ యాత్ర మొదలైంది. 400 నాటికల్ మైళ్ల దూరంలోని టైటానిక్ శకలాల వద్దకు వెళ్లి రావాల్సి ఉంది. తొలి 2 గంటల ప్రయాణం సాఫీగానే సాగింది. కానీ ఆ తర్వాత దీనికి సపోర్టింగ్ షిప్గా వచ్చిన పోలార్ ప్రిన్స్తో సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత కొద్దిసేపటికి గాలింపు చర్యలు మొదలుపెట్టారు.