హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. జాతీయ పార్టీలు రాష్ట్రంపై ఫోకస్ పెంచాయి. ఓ వైపు కాంగ్రెస్, మరో వైపు బీజేపీ 2 పార్టీల అధినాయకత్వాలు తెలంగాణపై దృష్టి పెట్టాయి. ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఏం చేయాలనే దానిపై ఆరా తీస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ కనిపిస్తుండగా బీజేపీలో నాయకులు హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు హైదరాబాద్ ప్రయాణాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈటల రాజేంద్ర, రాజగోపాల్ రెడ్డి ఢిల్లీలోనే మకాం వేసి ఉన్నారు. ఇప్పుడు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి కూడా అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన కూడా ఢిల్లీకి వెళ్లారు. బండి సంజయ్ ఢిల్లీ టూర్ పై పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.
అసంతృప్తి నేతల చర్చల తర్వాత ఢిల్లీ పర్యటనపై ఆసక్తి నెలకొంది. పార్టీ పెద్దలు, కేంద్రమంత్రులను బండి సంజయ్ కలవనున్నారు . ఈటల, రాజగోపాల్ చర్చల సారాంశం బండి సంజయ్కి వివరించే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ను ఢిల్లీకి పిలిచినట్లుగా తెలుస్తోంది. నిన్నటి తెలంగాణ పర్యటనలో బండి నాయకత్వంపై నడ్డా పొగడ్తలు వర్ష కురిపించడం, అంతకు ముందు రోజు ఢిల్లీలో అసంతృప్తి నేతలు ఈటల, రాజగోపాల్ రెడ్డిలకు బుజ్జగింపు జరపడం వరుస పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ టూర్ ఆసక్తి నెలకొంది.