ముంబాయి: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ జల్గావ్ పర్యటనలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. దీప్స్తంభ్ ఫౌండేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో వికలాంగ యువతి దేవేంద్ర ఫడ్నవీస్కు కాలివేలితో నుదిటిన తిలకం దిద్ది స్వాగతం పలికింది. దీంతో ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఫడ్నవీస్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు.
ఎందరో తల్లులు, సోదరీమణులు నా నుదుటిపై ‘తిలకం’ దిద్ది ఆశీర్వదించారు. ఈసారి కూడా బొటనవేలు నాకు తిలకం దిద్దింది. ఐతే అది చేతి బొటనవేలు కాదు, కాలి వేలితో. జీవితంలో ఇలాంటి క్షణాలు భావోధ్వేగానికి గురిచేస్తాయి. కళ్లు చమ్మగిల్లేలా చేస్తాయి. ఓ సోదరి నాకు కాలివేలితో నుదిటిన తిలకం దిద్ది, అదే వేళ్లతో హారతి ఇచ్చింది. ఆమె చాలా బలవంతురాలని, ఆమెకు ఎవరి సానుభూతి అవసరం లేదని, ఆమె ముఖంలో సంతోషం, కళ్లలో మెరుపు నాకు చెప్పాయంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు. చెల్లీ నీ ప్రతి యుద్ధంలో నేను అండగా ఉంటాను అని మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపాడు.