Home   »  తెలంగాణవార్తలు   »   బ్యాంకును దోచేందుకు ఏడో తరగతి విద్యార్థిని స్కెచ్.. తలుపులు పగులగొట్టి చోరీకి యత్నం..

బ్యాంకును దోచేందుకు ఏడో తరగతి విద్యార్థిని స్కెచ్.. తలుపులు పగులగొట్టి చోరీకి యత్నం..

schedule yuvaraju

బయ్యారం: ఏం అవసరమొచ్చిందో ఏమో, ఏకంగా బ్యాంకుకే కన్నం వేయాలని అనుకున్నాడో ఓ బుడ్డోడు. ఆలోచన వచ్చిందే తడవుగా ఓ గడ్డపార అందుకొని దగ్గరలోని బ్యాంకుకు వెళ్లాడు. తాళాలు పగులగొట్టి బ్యాంకు లోపలికి కూడా ప్రవేశించాడు. కానీ అప్పుడే అసలు సమస్య వచ్చింది. బ్యాంకులో డబ్బులు ఉంటాయని తెలుసు. కానీ ఎక్కడ దాస్తారో ఏడో తరగతి చదువుతున్న ఆ పిల్లాడి బుర్రకు తెలియదు కదా! డబ్బుల కోసం బ్యాంకులో అటు ఇటు తిరిగి ఎక్కడా కనిపించకపోవడంతో తీరిగ్గా ఇంటికి వెళ్లిపోయాడు. పొద్దున్నే బ్యాంకు తలుపులు తీసి ఉండటంతో కంగారుపడిపోయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా బయ్యారంలో ఉన్న ఒక SBI బ్యాంకులో జరిగింది.

బ్యాంక్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ బాలాజీ, ఎస్సై రమాదేవి బ్యాంక్‌ వద్దకు వెళ్లి పరిశీలించారు. బ్యాంకులో నుంచి ఎలాంటి నగదు, ఆభరణాలు చోరీకి గురికాలేదని నిర్ధారించారు. మరి ఎందుకు బ్యాంక్‌ లోపలికి ప్రవేశించి ఉంటారని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్యాంక్‌ ఆవరణలో ఉన్న సీసీ టీవీ కెమెరాలను పరిశీలించారు. సీసీ టీవీ ఫుటేజిలు చేసిన పోలీసులు, బ్యాంక్‌ సిబ్బంది ఒక్కసారిగా అవాక్కయ్యారు.

ఎందుకంటే బ్యాంక్‌లో చోరీకి యత్నించింది ఏడో తరగతి చదువుతున్న ఓ పిల్లాడు. అతను బ్యాంక్‌ సమీపంలో ఉంటున్న ఓ ట్రాక్టర్‌ డ్రైవర్‌ కొడుకుగా గుర్తించారు. గడ్డపారతో బ్యాంక్‌ డోర్‌ పగులగొట్టి దర్జాగా బ్యాంక్‌ లోపలికి వెళ్లాడు. పోలీసులు అతని దగ్గరికి వెళ్లి విచారించగా, బ్యాంక్‌ చోరీకి యత్నించింది తానేనని ఒప్పుకున్నాడు. దీంతో ఆ బాలుడికి కౌన్సెలింగ్‌ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.