ఖమ్మం: ఖమ్మం జనగర్జనలో రాహుల్కి జనం నీరాజనం పట్టారు. సభా ప్రాంగణానికి ఓపెన్ టాప్ కారులో వెళ్లిన రాహుల్గాంధీకి రోడ్డుకు రెండువైపులా బారులు తీరిన ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. అడుగడుగునా ప్రజలు ఆయనను అనుసరించారు. చకచకా నడుచుకుంటూ వెళ్లిన రాహుల్ గాంధీ కి పొంగులేటి శాలువా కప్పి సత్కరించారు. టీ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పుష్పగుచ్ఛం అందించారు. పాదయాత్ర చేసిన భట్టి విక్రమార్క ని అభినందించిన రాహుల్, ఆయన భుజం మీద చేతులు వేసి వేదికపై నడుస్తూ ప్రజలకు అభివాదం చేశారు. ఇక ప్రజా యుద్ధనౌక గద్దర్ రాహుల్కి ముద్దు పెట్టి ఆప్యాయంగా ఆలింగనం చేసుకోవడం అందరిని ఆకట్టుకుంది. తనకు కండువా కప్పిన సీతక్కను రాహుల్ ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు.
కాంగ్రెస్లో చేరిన పొంగులేటికి కండువా కప్పి నేనున్నా అంటూ చెయ్యి అందించి భరోసా ఇచ్చారు రాహుల్ గాంధీ. సభలో రేణుకా చౌదరిని రాహుల్ పక్కనే కూర్చోపెట్టుకున్నారు . ఆయన స్పీచ్ను తెలుగులోకి అనువాదం చేశారు టీ కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్కుమార్ రెడ్డి. ఇక రాహుల్ సభలో జై జగన్ జెండాలు కూడా కనిపించాయి. ‘జన గర్జన’ సభ గ్రాండ్ సక్సెస్ కాంగ్రెస్ కేడర్లో జోష్ నింపింది.