ఈ నెల 9 నుంచి 22 వరకు బంగ్లాదేశ్తో జరిగే టోర్నీలో ప్రాతినిధ్యం వహించే భారత మహిళా క్రికెట్ జట్టుకు అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లికి చెందిన అనూషా బారెడ్డి ఎంపికైంది.
ఇటీవల హాంకాంగ్ వేదికగా జరిగిన ఆసియాకప్ లో ఇండియా తరఫున ఆడిన అనూష బాగా ఆడి సెలక్టర్ల దృష్టిని ఆకర్షించింది. జిల్లా, రాష్ట్ర, జోనల్ స్థాయిల్లో రాణించి ఎట్టకేలకు టీమ్ ఇండియాలో చోటు దక్కించుకుంది.
రైతు కుటుంబమైనప్పటికీ తల్లిదండ్రులు బి.లక్ష్మీదేవి, మల్లిరెడ్డి ప్రోత్సాహం తోనే క్రికెట్ ఆడేందుకు ముందుకు వచ్చింది. ఎడమచేతి వాటం స్పిన్నర్, బ్యాట్స్మెన్ అయిన అనూష 2014లో అనంతపురం RTD అకాడమీలో చేరింది వారి సహకారంతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని అనూష తెలిపింది.
RTD ప్రోగ్రాం డైరెక్టర్ మాంచో ఫెర్రర్ మాట్లాడుతూ అనూష కెరీర్ ఇతర క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమన్నారు. నూతన ప్రతిభావంతులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం అని అన్నారు.