జగనన్న విదేశీ విద్యా దీవెన గ్రాంట్, పౌర సేవల ప్రోత్సాహక నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(CM Jagan Mohan Reddy)విడుదల చేశారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న అర్హులైన 390 మంది విద్యార్థులకు ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ కింద రూ.41.60 కోట్లను చెల్లిస్తున్నామని తెలిపారు. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 95 మంది, వారిలో తిరిగి మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది అభ్యర్థులకు ‘జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం’ కింద రూ.100.50 లక్షల ప్రోత్సాహకాన్ని అందిస్తున్నామన్నారు.
ప్రధానాంశాలు
విదేశాల్లో చదువుకోవాలనుకునే నిరుపేద విద్యార్థుల కలలను నెరవేర్చడమే ఈ పథకం లక్ష్యం..
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. మంచి యూనివర్సిటీల్లో సీటు పోందితే ఫీజు ఎంతయినా ప్రభుత్వం భరిస్తుందన్నారు. ఈ ఏడాది 51మందికి అడ్మిషన్ ఇస్తున్నారని.. రూ.41.59 కోట్లు ఫీజులు ఇప్పుడు చెల్లిస్తున్నామని తెలిపారు. నిరుపేద విద్యార్థుల చదువుకు ఆటంకాలు ఎదురుకాకూడదని ఉద్ఘాటించారు. పేద విద్యార్థుల తల్లిదండ్రులపై భారం లేకుండా ఆదుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందని తెలిపారు. విదేశాల్లో చదువుకోవాలనుకునే నిరుపేద విద్యార్థుల కలలను నెరవేర్చడమే ఈ పథకం లక్ష్యమని చెప్పారు.
విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకురావడమే జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం లక్ష్యం..
పేద, మధ్యతరగతి, వెనుకబడిన కుటుంబాల విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకురావడమే జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం లక్ష్యమని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన అనేక మంది విద్యార్థులు విదేశాల్లోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారని, అర్హులైన విద్యార్థులందరికీ ప్రభుత్వం సహాయ సహకారాలు అందజేస్తుందని ఆయన అన్నారు.
మెయిన్స్లో అర్హత సాధించిన వారికి లక్షన్నర రూపాయలు అందజేస్తాం: CM Jagan Mohan Reddy
ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు లక్ష రూపాయలు, మెయిన్స్లో అర్హత సాధించిన వారికి లక్షన్నర రూపాయలు అందజేస్తామని ఆయన పేర్కొన్నారు. 8 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తులందరికీ ఈ పథకం వర్తిస్తుంది.
అన్ని జిల్లాల వ్యాప్తంగా వివిధ పోటీ పరీక్షలకు హాజరైన కలెక్టర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, చదువుతున్న వారందరికీ ముఖ్యమంత్రి జగన్ అభినందనలు తెలిపారు. ఎవరైనా విద్యార్థి కష్టపడి ప్రఖ్యాత యూనివర్సిటీలో అడ్మిషన్ సాధిస్తే ఫీజుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఆర్థిక భారం లేకుండా ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
ALSO READ: వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై సీఎం జగన్ దృష్టి..