Vijayawada Railway Division | 2023-24 ఆర్థిక సంవత్సరంలో విజయవాడ రైల్వే డివిజన్ రికార్డు స్థాయి ఆదాయం అర్జించింది. డివిజన్ చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయి ఆదాయం ఆర్జించినట్లు రైల్వే DRM నరేంద్ర ఆనందరావు పాటిల్ తెలిపారు.
ప్రధానాంశాలు
ఆంధ్రప్రదేశ్: దక్షణ మధ్య రైల్వే (SCR) స్టేషన్లలో ప్రయాణికులకు సౌకర్యవంతంగా, అదేవిధంగా సరకు రవాణాకు అన్ని వైపులా అనుకూలంగా ఉండే స్టేషన్ విజయవాడ రైల్వే స్టేషన్. ఇది అన్ని ప్రాంతాలకు సమదూరంలో ఉండటంతో ఈ రైల్వే స్టేషన్ (Vijayawada Railway Division) ఎప్పుడూ రద్దీగా ఉంటుంది.
Vijayawada Railway Division సరికొత్త రికార్డు
ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే (SCR) లోని విజయవాడ రైల్వే డివిజన్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో 36.2 మిలియన్ టన్నుల సరకు రవాణా ద్వారా ₹3,975 కోట్ల రాబడి సాధించి సరికొత్త రికార్డు నమోదు చేసిందని డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) నరేంద్ర ఆనందరావు పాటిల్ తెలిపారు.
విజయవాడ రైల్వే డివిజన్ 2018-19లో ₹3,875 కోట్ల ఆదాయం సాధించగా, ఇప్పుడు ఆ రికార్డు బ్రేకయ్యింది. సరకు రవాణాలో కృష్ణపట్నం, కాకినాడ పోర్టులు తొలి 2 స్థానాల్లో నిలిచాయి. అత్యధికంగా 19.36 మిలియన్ టన్నుల బొగ్గు, 6.68 మిలియన్ టన్నుల ఎరువులను రవాణా చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
పోర్టు ప్రాంతాలకు ట్రైన్ కనెక్టివిటీ
సరకు రవాణాలో ప్రధానంగా బొగ్గు, ఎరువుల ద్వారా అత్యధిక ఆదాయం సమకూరిందని, లోకల్ బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్ బృందాల చర్చలు, ట్రాఫిక్ అనుకూలత డివిజన్ సరకు రవాణా ఆదాయం పెరిగేందుకు దోహదపడింది. కొత్తగా కలప, లేటరైట్ లోడింగ్లు చేయడం కూడా ఆదాయం పెరగడానికి సహాయపడింది. అలాగే డివిజన్ వ్యాప్తంగా రూ.158 కోట్ల వ్యయంతో 15 గూడ్స్ షెడ్డుల ఆధునికీకరణపై విజయవాడ డివిజన్ దృష్టి సారించింది. అన్నవరం వద్ద కాకినాడ గేట్-వే పోర్ట్, మచిలీపట్నం ఓడరేవు, రామాయణపట్నంతో పాటు మరో మూడు పోర్టులకు కనెక్టివిటీ పెంచారు.
డివిజన్ ఆదాయం పెంపులో కీలకపాత్ర పోషించిన సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ వావిలపల్లి రాంబాబు, సీనియర్ డివిజనల్ ఆపరేటింగ్ మేనేజర్ D. నరేంద్రవర్మ, బిజినెస్ డెవలప్మెంట్ యూనిట్ల (BDU) అధికారులు, సిబ్బందిని పాటిల్ అభినందించారు.