ఉత్తరకొరియా గురువారం ఉదయం చేపట్టిన నిఘా ఉపగ్రహ ప్రయోగం విఫలమైంది. మూడు నెలల క్రితం తొలిసారి ఆ దేశం చేపట్టిన ప్రయోగం విఫలమై రాకెట్ సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ప్రయోగంలో రాకెట్ మూడో దశలో విఫలమైనట్లు ఆ దేశమీడియా సంస్థ కేసీఎన్ఏ వెల్లడించింది. ఈ వైఫల్యంపై ఆ దేశ స్పేస్ ఏజెన్సీ స్పందిస్తూ… అక్టోబర్లో మరోప్రయోగం చేపడతామని వెల్లడించింది.
యుద్ధ సమయంలో శత్రుదేశాలపై నిఘా పెట్టేందుకు, తమ దేశ పైలట్లకు సహాయకారిగా ఉండేందుకు నిఘా ఉపగ్రహ ప్రాజెక్టును కిమ్ సర్కారు చేపట్టింది. రాకెట్ మూడో దశ ఎమర్జెన్సీ బ్లాస్టింగ్ వ్యవస్థలో లోపం కారణంగా ఈ ప్రయోగం విఫలమైందని కేసీఎన్ఏ కథనంలో పేర్కొంది.