Home   »  ఉద్యోగం   »   Group 2 పరీక్ష నిర్వహణపై సందిగ్ధత..

Group 2 పరీక్ష నిర్వహణపై సందిగ్ధత..

schedule sirisha

TSPSC Group 2 EXAM 2023: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో, వివిధ రిక్రూట్‌మెంట్ పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉంది.

ముఖ్యంగా నవంబర్ 2, 3 తేదీల్లో జరగనున్న టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష, నవంబర్ 25 నుంచి 30 వరకు జరగనున్న టీఆర్టీ-ఎస్జీటీ పరీక్షలపై చర్చ జరుగుతోంది.

నవంబర్ 3 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

తెలంగాణలో నవంబర్ 3 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతాయి. తెలంగాణ గ్రూప్-2 పరీక్షకు పోలీసు, ఇతర శాఖల సిబ్బందిని పెద్దఎత్తున కేటాయించేందుకు అధికారులు ఇబ్బందులు పడుతున్నారు.

Group 2 పరీక్ష నిర్వహణపై కొంత సందిగ్ధత

మొత్తం 783 గ్రూప్-II పోస్టులకు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు పెట్టుకున్నారు. గ్రూప్-2 పరీక్ష (TSPSC Group 2 exam) నిర్వహించడానికి 1600 కేంద్రాల్లో 25,000 మంది పోలీసులు మరియు 20,000 మంది పరీక్ష సిబ్బంది అవసరం.

ఎన్నికల నేపథ్యంలో పరీక్షకు సిబ్బందిని సర్దుబాటు చేయడం కష్టమని కలెక్టర్లు సూచించినట్లు వివరించారు. రిటర్నింగ్, ఎగ్జామినేషన్ చీఫ్ సూపరింటెండెంట్ అధికారుల నియామకం సాధ్యం కాదని వెల్లడించారు. రెండు రోజుల పాటు వరుసగా నాలుగు సెషన్లలో పరీక్షల నిర్వహణకు సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతాయని వివరించారు.

అలాగే రవాణా ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పరీక్ష నిర్వహణపై కొంత సందిగ్ధత నెలకొంది. ఒకవేళ టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడితే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత డిసెంబర్ మూడో వారంలో నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీఎస్ పీఎస్సీ కమిషన్ మరోసారి సమావేశమై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

TS TRT పరీక్ష కూడా వాయిదా

టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ ( TS TRT)లో భాగమైన సెకండరీ గ్రేడ్ టీచర్స్ (SGT) పరీక్షలు కూడా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నవంబర్ 20 నుంచి 30 వరకు టీఆర్‌టీ నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్‌ విడుదల చేశారు.

ఇందులో స్కూల్ అసిస్టెంట్లు, పీఈటీ, భాషా పండితుల పోస్టులకు నవంబర్ 20 నుంచి 24 వరకు, నవంబర్ 25 నుంచి 30 వరకు ఎస్జీటీ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.

నవంబర్ 30న జరగనున్న SGT పరీక్ష కూడా వాయిదా

నవంబర్ 30న జరగనున్న ఎన్నికల దృష్ట్యా కనీసం SGT పరీక్షలను కూడా వాయిదా వేయకతప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉపాధ్యాయులు ఎన్నికల ప్రక్రియలో పెద్దఎత్తున పాల్గొంటారని, అందుకే TRT నిర్వహణపై దృష్టి సారించలేమని విద్యాశాఖ భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

అలాగే నవంబర్ 20 నుంచి 24 వరకు జరగనున్న స్కూల్ అసిస్టెంట్, పీఈటీ, భాషా పండితుల పోస్టుల పరీక్షలకు ఎలాంటి ఇబ్బంది లేదని త్వరలోనే ప్రభుత్వం, అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వ్యక్తమవుతోంది.