హైదరాబాద్: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.
తెలంగాణలో వరద హెచ్చరిక జారీ చేసినందుకు గాను జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి Shanti Kumari ఆదేశించారు.
ముఖ్యంగా తెలంగాణపై దీని తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటికే హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. రాష్ట్రంలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయని, ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖల సమన్వయంతో కట్టు దిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.
ఇప్పటికే వివిధ జిల్లాల్లోని చెరువులు, కుంటలు నిండి ఉన్నాయని, ఆయా చెరువులకు గండ్లు పడడం, తెగిపోకుండా ఉండేందుకు తగు రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
ఉదృతంగా ప్రవహించే కాజ్-వే లు, కల్వర్టులు, వంతెనల వద్ద ముందు జాగ్రత్త చర్యగా తగు భద్రతా ఏర్పాట్లను చేపట్టాలని “సీఎస్” అన్నారు.
భారీ వర్షాలు, వరదలతో జరిగే నష్టాన్ని నివారించేందుకుగాను సంబంధిత మండల స్థాయి రెవెన్యూ, పిఆర్ తదితర అధికారులతో రెగ్యులర్ టెలీకాన్ఫరెన్స్ ల ద్వారా సమీక్షించాలని పేర్కొన్నారు.
ప్రతీ జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసి పరిస్థితులను సమీక్షించాలన్నారు.
వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో తగు సహాయ కార్యక్రమాలకై స్థానిక అగ్నిమాపక, పోలీసు బృందాలను మోహరించాలని కొరారు.
వరద ప్రభావిత ప్రాంతాల నుండి ప్రజలను సురక్షిత ప్రాతాలకు తరలించి వరద బాధిత కుటుంబాలకు సహాయక శిబిరాలను ఏర్పాటు చేయాలని చెప్పారు.
బాధితులకు ఆహారం, మంచినీరు, వైద్య తదితర మౌలిక సదుపాయాలను కల్పించాలని “సీఎస్” ఆదేశించారు.
గ్రేటర్ హైదరాబాద్ లోతట్టు ప్రాంతాల్లో ముందస్తు ఏర్పాట్లను చేయడంతో పాటు, మ్యాన్ హోళ్ల పై కప్పులు తెరువకుండా నగర వాసులను చైతన్య పర్చాలని తెలిపారు.
ఈ టెలీకాన్ఫరెన్స్ లో అంజనీ కుమార్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రజత్ కుమార్, సునీల్ శర్మ, పంచాయితీ రాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా పాల్గొని Shanti Kumari తో మాట్లాడారు.