Assam CID issued summons | అస్సాంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా ప్రజా ఆస్తులకు నష్టం కలిగించినందుకు గాను అస్సాం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CID) సమన్లు జారీ చేసింది.
ప్రధానాంశాలు
Assam CID issued summons | భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా అస్సాంలో ప్రజా ఆస్తులకు నష్టం కలిగించినందుకు గాను రాహుల్ గాంధీతో సహా 11 మంది కాంగ్రెస్ నేతలకు అస్సాం క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CID) సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 23న గౌహతిలో CID అధికారుల ఎదుట హాజరుకావాలని కాంగ్రెస్ నేతలను ఆదేశించింది.
11 మంది కాంగ్రెస్ నేతలకు సమన్లు జారీ చేసిన అస్సాం CID
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CRPC) సెక్షన్ 41-A (3) ప్రకారం సోమవారం సమన్లు జారీ చేసినట్లు CID అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి KC వేణుగోపాల్, జితేంద్ర సింగ్ అల్వార్, యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు BV శ్రీనివాస్, నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) ఇన్ఛార్జ్ కన్హయ్య కుమార్, అస్సాం యూనిట్ కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా, లోక్సభ MP గౌరవ్ గొగోయ్, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత దేబబ్రత సైకియా తదితరులకు కూడా సమన్లు అందాయి.
ఈ సమన్లపై ప్రతిపక్ష నేత దేబబ్రత సైకియా మీడియాతో మాట్లాడుతూ, తాము చట్ట ప్రకారం అన్ని విధానాలను అనుసరిస్తామని మరియు దర్యాప్తు అధికారుల ముందు హాజరవుతామని తెలిపారు. అయితే ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడంలో కాంగ్రెస్ నేతలు ఎవరూ లేరని కూడా ఆయన తేల్చి చెప్పారు.
ఎన్నికల తర్వాత నిందితులను అరెస్ట్ చేస్తారన్న అస్సాం CM
జనవరి 23న, అస్సాం పోలీసులు రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ నాయకులపై భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత నిందితులైన కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రకటించారు.
Also Read | ED విచారణకు మరోసారి డుమ్మా కొట్టిన ఢిల్లీ CM..!