ప్రధానాంశాలు
న్యూఢిల్లీ: ఈ సారి రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా పాగా వేయాలనే పట్టుదలతో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) తమ పార్టీ అభ్యర్థుల రెండవ జాబితాను శనివారం నాడు విడుదల చేసింది. 83 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
ఝల్రాపటన్ నుంచి వసుంధరా రాజే పోటీ
మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఝల్రాపటన్ నుంచి పోటీ చేయనుండగా, అంబర్ నియోజకవర్గం నుంచి సతీష్ పునియా, తారానగర్ నుంచి రాజేంద్ర రాథోడ్, నాగపూర్ నుంచి జ్యోతి మీర్దా పోటీలో ఉండనున్నారు.
BJP అభ్యర్థుల పేర్లు ఖరారు చేసేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్షా, బీజేపీ నేతలు బీఎల్ సంతోష్, వసుంధరా రాజే, ప్రహ్లాద్ జోషి, గజేంద్ర సింగ్ షెకావత్, కైలాష్ చౌదరి, సతీష్ పునియా, సీపీ జోషి, అరుమ్ సింగ్, కల్దీప్ బిష్ణోయ్ రాజేంద్ర రాథోడ్, కో-ఎలక్షెన్ ఇన్చార్జి నితిన్ పటేల్, కో-ఇన్చార్జి విజయ్ రహత్కర్లు శుక్రవారంనాడు సమావేశమై ఈ జాబితాను సిద్ధం చేశారు.
రెండు సార్లు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వసుంధరా (BJP)
కాగా, సింథియా రాయల్ ఫ్యామిలీకి చెందిన వసుంధరా రాజే రెండు సార్లు రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. తొలిసారి 2003 నుంచి 2008 వరకూ, రెండోసారి 2013 నుంచి 2018 వరకూ పదవిలో ఉన్నారు. సంప్రదాయసిద్ధంగా ఝలార్పాటన్ నుంచి ఆమె పోటీ చేస్తున్నారు.
మరోసారి అధికారం కాంగ్రెస్దే అంటున్న అశోక్ గెహ్లాట్
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేతపట్టారు. మరోసారి అధికారం కాంగ్రెస్దేనని ఆయన బలంగా నమ్ముతున్నారు. 2024 లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ సైతం ఈసారి తిరిగి అధికారంలోకి రావాలని బీజేపీ పట్టుదలగా ఉండటం అందుకు అనుగుణంగానే 41 మందితో అభ్యర్థుల తొలి జాబితాను ఈనెలలోనే విడుదల చేయటం జరిగింది. నవంబర్ 25న రాజస్థాన్లో ఎన్నికలు జరుగనుండగా, డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.