Corona JN1: భారత్లో కరోనా సబ్ వేరియంట్ JN1 చాపకిందనీరులా విస్తరిస్తుంది. దేశంలో తాజాగా ఈ రకమైన కేసులు 263 కు చేరినట్లు ఇండియన్ సార్స్ కోవ్ 2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) మంగళవారం వెల్లడించింది.
ప్రధానాంశాలు
చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా JN1 వేరియంట్
దేశంలో ఈ కొత్త వేరియంట్ (Corona JN1) పది రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు విస్తరించినట్టు తెలిపింది. కేరళలో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. కేరళలో మొత్తం 133 JN1 కేసులు నమోదయ్యాయి.
తాజాగా 263 కు చేరిన Corona JN1 వేరియంట్ కేసులు
ఆ తర్వాత గోవాలో 51, గుజరాత్లో 34, ఢిల్లీలో 16, కర్ణాటకలో 8, మహారాష్ట్రలో 9, రాజస్థాన్లో 5, తమిళనాడులో 4, తెలంగాణలో 2, ఒడిశాలో 1 కేసు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో డిసెంబర్లో 239 కేసులు వెలుగులోకి వచ్చాయని, నవంబర్లో 24 కేసులు వెలుగులోకి వచ్చాయని INSACOG వెల్లడించింది.
పలు జాగ్రత్తలు పాటించాలన్న కేంద్రం
మరోవైపు BA 2.86 రకానికి చెందిన ఈ JN1 సబ్టైప్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేక వేరియంట్ గా వర్గీకరించింది. దీని వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ, ముప్పు తక్కువగా ఉందని స్పష్టమవుతోంది. దేశంలో ఇలాంటి కేసులు పెరుగుతున్నా ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అయితే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
గడిచిన 24 గంటల్లో 573 కరోనా కేసులు నమోదు
మరోవైపు భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో 573 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. తాజా కేసులతో, దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,565కి చేరింది. కాగా నిన్న ఒక్కరోజే రెండు మరణాలు సంభవించాయి. హర్యానాలో ఒకరు, కర్ణాటకలో ఒకరు మరణించారు. ఇప్పటివరకు కోవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,366 కు చేరింది. 4,44,76,550 మంది కోవిడ్ నుండి కోలుకున్నారు.