ఢిల్లీ | వాయువ్య ఢిల్లీలోని పితంపుర ప్రాంతంలో గురువారం సాయంత్రం ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. క్షతగాత్రులను స్థానిక పోలీసులు రక్షించి బాబూ జగ్జీవన్ రామ్ ఆసుపత్రికి తరలించగా, గాయపడిన ఏడుగురిలో ఆరుగురు మరణించారు మరియు ఒకరు విషమ పరిస్థితిలో ఉన్నారు.
ప్రధానాంశాలు
Fire Accident in Delhi | వాయువ్య ఢిల్లీలోని పితంపుర ప్రాంతంలో గురువారం సాయంత్రం ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో ఆరుగురు మరణించగా, ఒకరు గాయపడ్డారు. మృతులు 25 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులు. ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ జితేంద్ర మీనా మాట్లాడుతూ, “ప్రమాదం నుండి ఏడుగురిని రక్షించి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ 6 గురు మరణించారు. అందులో నలుగురు మహిళలు, ఇద్దరు మగవారు ఉన్నట్లు జితేంద్ర మీనా తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మరణించిన వారందరూ అద్దెదారులు. అయితే అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను అదుపులోకి తెచ్చారు.
రాత్రి 8 గంటల సమయంలో ఘటన (Fire Accident in Delhi)
రాత్రి 8 గంటలకు ప్లాట్ నెం. 37 లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక అధికారులు ఎనిమిది ఫైర్ ఇంజన్లను ఉపయోగించినట్లు తెలిపారు. స్థానిక పోలీసుల సహాయంతో ఏడుగురిని రక్షించి బాబు జగ్జీవన్ రామ్ ఆసుపత్రికి తరలించారు. మొత్తం ఆరుగురు ఆసుపత్రిలో మరణించినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ (DFS) అధికారి ఒకరు వెల్లడించారు.
భవనం మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు
ఘటనా స్థలం వద్ద మంటలను ఆర్పివేశామని, కూలింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని మరో DFS అధికారి తెలిపారు. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయని, దాని పైన ఉన్న మూడు అంతస్తుల్లో పొగలు కమ్ముకున్నాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఏరియా ఉందని, మిగిలిన అంతస్తుల్లో ప్రజలు నివసిస్తున్నారని ఆయన తెలిపారు. తదుపరి విచారణ జరుగుతోందని ఢిల్లీ పోలీస్ అధికారులు తెలిపారు.