మహబూబ్ నగర్ : అమెరికాలోని ఇల్లినాయిస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన విద్యార్థి మృతి చెందాడు. భూత్పూర్ మండలం కప్పెట గ్రామానికి చెందిన బోయ మహేశ్ (25) కాంకోర్డియా యూనివర్సిటీలో ఎంఎస్ చదివేందుకు డిసెంబర్లో అమెరికా వెళ్లాడు.
మహేష్ అతని స్నేహితులు శివ, శ్రీ లక్ష్మి మరియు భరత్ లాంగ్ డ్రైవ్కు వెళ్లారు. వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్ అడవి జంతువును తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం.
మహేశ్ అక్కడికక్కడే మృతి చెందగా, మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన మరణవార్త తెలియగానే గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.