తెలంగాణ: రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతమైంది. హైదరాబాద్లో సెంటర్ ఆఫ్ టెక్నాలజీ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేసేందుకు లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ముందుకు వచ్చింది. సుమారు వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని కంపెనీ తెలిపింది. మంత్రి కేటీఆర్ – లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ యొక్క CIO ఆంథోనీ మెక్కార్తీని లండన్లో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఎన్ఆర్ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ఆంథోనీ మెక్కార్తీలు హైదరాబాద్లో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. ఈ కేంద్రం ద్వారా హైదరాబాద్లోని బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాలకు భారీ ప్రోత్సాహం లభించనుంది.
తెలంగాణ ప్రభుత్వ నిరంతర కృషితో వ్యవసాయం నుంచి ఐటీ వరకు అన్ని రంగాల్లో రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించిందని మంత్రి కే తారకరామారావు అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికీకరణ వేగం పుంజుకుందన్నారు. లండన్లో భారత హైకమిషనర్ విక్రమ్ కె దురైస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఇన్వెస్ట్మెంట్ రౌండ్ టేబుల్’ సమావేశంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. తెలంగాణలో పెట్టుబడి అవకాశాలను కంపెనీ ప్రతినిధులు తదితరులు వివరించారు. తెలంగాణలో ఇన్నోవేషన్, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై ప్రభుత్వం 9 ఏళ్ల నుంచి కృషి చేస్తుందన్నారు.