నల్గొండ: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర నల్గొండ జిల్లాలో కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు విమర్శలు ఎక్కుపెట్టడంతో BRS నేతలు ప్రతివిమర్శలు చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒక వైపు కర్నాటక ఫలితాలు, మరోవైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో T- కాంగ్రెస్ లో మరింత జోష్ పెరిగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భట్టి పాదయాత్ర ఎంట్రీ తర్వాత రాజకీయంగా ప్రకంపనలు రేగుతున్నాయి. నల్గొండ అభివృద్ధి బీఆర్ఎస్ ఎన్నికల హామీలపై భట్టి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మంత్రి జగదీష్రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా జిల్లాకు చేసిందేమీలేదని విమర్శించారు.
భట్టీ కామెంట్స్ బీఆర్ఎస్లో కాకరేపాయి. భట్టి విక్రమార్క విమర్శలపై గుత్తా సుఖేందర్రెడ్డి ఫైరయ్యారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర గమనం, గమ్యం లేకుండా పోయిందని విమర్శించారు. పాదయాత్రకు ప్రజల నుండి స్పందన కరువైందన్నారు గుత్తా సుఖేందర్రెడ్డి. గుత్తా సుఖేందర్రెడ్డే గమ్యం, గమనంలేని పొద్దుతిరుగుడు పువ్వు అని విమర్శించారు. అధికారం ఎక్కడ ఉంటే అటువైపు వెళ్లే వ్యక్తి అని మండిపడ్డారు భట్టి విక్రమార్క.
రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్రావ్ ఠాక్రే భట్టి విక్రమార్క పాదయాత్రతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడిందని కొనియాడారు. నల్లగొండజిల్లాలో కొనసాగుతున్న భట్టిపాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ-బీఆర్ఎస్ రహస్యమిత్రులేనని విమర్శించారు మాణిక్రావ్ ఠాక్రే.