Home   »  వార్తలుజాతీయంతెలంగాణ   »   25లక్షలు పెట్టండి.. నెలకు లక్ష ఆదాయం పొందండి.. స్కీమ్‌ల పేరిట మోసం

25లక్షలు పెట్టండి.. నెలకు లక్ష ఆదాయం పొందండి.. స్కీమ్‌ల పేరిట మోసం

schedule yuvaraju

హైదరాబాద్‌ పోలీస్‌: మల్టీలెవల్‌ మార్కెట్‌తో దేశ వ్యాప్తంగా రూ. 200 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడ్డ ఢిల్లీ, గజియాబాద్‌కు చెందిన ఘరానా ముఠాను సీసీఎస్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ వివరాలను వెల్లడించారు.

ఢిల్లీకి చెందిన పర్‌ఫెక్ట్‌ హెర్బల్‌ కేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఢిల్లీ సంస్థకు అదే ప్రాంతానికి చెందిన రియాజుద్దీన్‌ అలియాస్‌ రియాజ్‌ అహ్మద్‌, షకీల్‌, పూజాకుమారి డైరెక్టర్లుగా ఉన్నారు. ఆ సంస్థ ఆధ్వర్యంలో సూపర్‌ మార్కెట్లు, పర్‌ఫెక్ట్‌ బజార్‌లు, ఐడీ స్కీమ్‌ల పేరుతో 3 వేర్వేరు స్కీమ్‌లు తయారు చేశారు. ఈ స్కీమ్‌లలో పెట్టుబడులు పెట్టాలంటూ హైదరాబాద్‌తో పాటు వివిధ నగరాల్లో కస్టమర్లను ఆకర్షించేందుకు సమావేశాలు నిర్వహించి ఆకట్టుకున్నారు. ఐడీ స్కీమ్‌లో రూ. 9999 పెట్టుబడిపెడితే 36 నెలలపాటు రూ. 880 తిరిగి చెల్లిస్తారు. దీంతో పాటు హెర్బల్‌ ఉత్పత్తులపై డిస్కౌంట్లు ఉంటాయి. పర్‌ఫెక్ట్‌ హెర్బల్‌ స్టోర్స్‌కు రూ. 6 లక్షలు పెట్టుబడిగా పెడితే 30 నెలల పాటు రూ. 30 వేల చొప్పున అందిస్తారు. ఈ స్టోర్‌లో అమ్మే విక్రయాలపై 5 శాతం కమీషన్‌ ఇస్తారు.

పర్‌ఫెక్ట్‌ బజార్‌లో రూ. 25 లక్షలు పెట్టుబడిగా పెడితే 30 నెలల పాటు నెలకు 1లక్ష రూపాయలు, విక్రయాలపై 3 నుంచి 5 శాతం కమీషన్‌ ఇచ్చే విధంగా ఈ స్కీమ్‌లను నిర్వహించారు. ఈ స్కీమ్‌లలో చేరిన వారు మరికొందరిని చేర్పించాల్సి ఉంటుంది. ఇలా చేరిన వారు ఇంకొందరిని చేర్పిస్తూ వెళ్లాలి. ఇలా చేర్పిస్తే ప్రత్యేకంగా కమీషన్‌ ఇస్తారు. ఎక్కువగా సభ్యులను చేర్పించిన వారికి టూర్లు, ల్యాప్‌టాప్‌, బంగారు ఆభరణాలు, బైక్‌లు, కార్లు, ఫ్లాట్లను గిఫ్టుగా ఇచ్చే విధంగా ఆఫర్లు రూపొందించారు.