మధ్యప్రదేశ్ : ఆదివాసీ యువకుడిపై మూత్ర విసర్జన ఘటనపై మరో వివాదం తెరపైకి వచ్చింది. అసలైన బాధితుడ్ని దాచేసి, మరొకరి కాళ్లు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ కడిగాడని, ప్రజాగ్రహాన్ని చల్లార్చేందుకు బీజేపీ ప్రభుత్వం డ్రామా చేసిందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. మూత్ర విసర్జన ఘటన 2020లో చోటుచేసుకుందని, ఆ వీడియోలో బాధితుడి వయస్సు 16 లేదా 17 ఏండ్లు ఉంటాయని, జిల్లా పోలీసులు, కలెక్టర్ గుర్తించిన బాధితుడు దశ్మత్ రావత్కు 36 లేదా 38 ఏండ్లు ఉంటాయని సోషల్ మీడియాలో పోస్టులు వెలువడ్డాయి.
దశ్మత్ రావత్ మీడియాతో చెప్పిన మాటలు అనుమానాల్ని మరింత పెంచాయి. ‘మూడేండ్ల క్రితం జరిగిందీ ఘటన. మద్యం సేవించడంతో మూత్ర విసర్జన ఎవరు చేశారన్నది తెలియలేదు. నిందితుడు నేరాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి అధికారులు చెప్పిందే నేను నమ్ముతున్నా’ అన్న దశ్మత్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ‘ఇదంతా పెద్ద కుట్ర, నిజమైన బాధితుడ్ని దాచేశారు, ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరు’ అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది.