Home   »  తెలంగాణవార్తలు   »   నర్సింగ్‌ విద్యార్ధిని ఆత్మహత్య.. మిస్టరీగా డెత్‌ కేస్‌..!

నర్సింగ్‌ విద్యార్ధిని ఆత్మహత్య.. మిస్టరీగా డెత్‌ కేస్‌..!

schedule yuvaraju

తెలంగాణ: ఖమ్మం జిల్లాలో ఓ నర్సింగ్‌ విద్యార్థిని ఆత్మహత్య కు పాల్పడింది. ఈ విషాద ఘటన బుధవారం (జూన్‌ 21) జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మద్దుకూరుకు చెందిన కోడెం కృష్ణ, రమాదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రెండో కుమార్తె కావ్య(19) ఖమ్మంలోని పారా మెడికల్‌ కాలేజీలో నర్సింగ్‌ (ఏఎన్‌ఎం) చదువుకుంటూ, సమీపంలోని ఒక ఆసుపత్రిలో నర్స్‌గా పనిచేస్తూ, కావ్య స్నేహితురాలైన సీతామహాలక్ష్మితో కలిసి ఓ అద్దె గదిలో ఉంటోంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి విధులు ముగించుకుని వచ్చిన కావ్య నిద్రపోయింది. బుధవారం ఉదయం నిద్రపోతుండగా స్నేహితురాలు సీతామహాలక్ష్మి విధులకు వెళ్లింది. కావ్య మరో స్నేహితురాలైన తనుశ్రీ ఆమె ఉంటున్న గదికి వచ్చి కాసేపు మాట్లాడి తిరిగి వెళ్తున్న క్రమంలో తనుశ్రీకి పెద్ద శబ్దం వినిపించింది. ఏం జరిగిందా అని కావ్య గదిలోకి వెళ్లి చూస్తే కావ్య ఉరి వేసుకుని కనిపించింది.

వెంటనే చుట్టుపక్కల వారిని పిలవడంతో వారు కావ్యను కిందకు దించారు. అప్పటికే కావ్య మృతి చెందినట్లు గ్రహించారు. తాను మాట్లాడినప్పుడు కావ్య నీరసంగా ఉన్నట్లు తనుశ్రీ తెలిపింది. ఘటనకు ముందు కావ్య తన తల్లి రమాదేవికి ఫోన్‌ చేసింది. తనకు జాగ్రత్తలు చెప్పినట్లు తల్లి రమాదేవి వెల్లడించింది. తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతూ తల్లి రమాదేశి ఖమ్మం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.