శ్రీలంక: వన్డే ప్రంపచ కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో దుమ్మురేపుతున్న శ్రీలంక. సూపర్ సిక్స్ ఐదో మ్యాచ్లోనూ విజయం సాధించింది. శుక్రవారం జరిగిన పోరులో శ్రీలంక 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్ను చిత్తుచేసింది. మొదట విండీస్ 48.1 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. కార్టీ (87) టాప్ స్కోరర్ కాగా లంక బౌలర్లలో తీక్షణ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో లంక 44.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది.
పాతుమ్ నిషాంక (104; 14 ఫోర్లు) శతక్కొట్టగా దిముత్ కరుణరత్నె (83) రాణించాడు. ఈ టోర్నీ సూపర్ సిక్స్లో ఆడిన 5 క్రికెట్ మ్యాచ్ల్లోనూ నెగ్గిన లంక 10 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటికే వన్డే ప్రపంచకప్ బెర్త్ ఖరారు చేసుకున్న శ్రీలంక, నెదర్లాండ్స్ మధ్య ఆదివారం వన్డే ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ టోర్నీ ఫైనల్ జరుగనుంది.