సుఖేష్ చంద్రశేఖర్ మరో బాంబ్ పేల్చాడు. మనీ లాండరింగ్ కేసులో ఊచలు లెక్కిస్తున్న సుఖేష్ ఈసారి ఎంపీ కవిత, మంత్రి కేటీఆర్లను టార్గెట్ చేస్తూ సంచలన లేఖ విడుదల చేశాడు. గతంలో తాను ఇచ్చిన స్టేట్మెంట్లు వెనక్కి తీసుకోవాలంటూ కవిత, కేటీఆర్ ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించాడు. సాక్ష్యాలు ఇవ్వాలని తనపై ఒత్తిడి చేస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించిన చాట్ హిస్టరీ కూడా ఉంది అంటూ చెప్తున్నాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర 100కోట్ల భూమితోపాటు ఎన్నికల్లో సీటు ఇస్తామంటున్నారని లేఖలో రాశాడు. లిక్కర్ స్కామ్తోపాటు పలు అంశాలపై పదేపదే లేఖలు విడుదల చేస్తున్న సుఖేష్ ఈసారి కేటీఆర్ తనపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పడం చర్చనీయాంశమైంది.
అయితే సుఖేష్ ఆరోపణలపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. సుఖేష్ చేసిన ఆరోపణలు తన దృష్టికి వచ్చాయన్నారు. అసలా వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదన్నారు. సుఖేష్ చంద్రశేఖర్ వ్యాఖ్యలపై న్యాయపరంగా ముందుకు వెళ్తామని కేటీఆర్ చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. గతంలో కవితపైన, ఇప్పుడు కేటీఆర్ పైన ఆరోపణలతో సుఖేష్ ఇలా వ్యవహరించడంపై బీఆర్ఎస్ శ్రేణుల నుంచి కూడా తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.