ప్రధానాంశాలు
హైదరాబాద్: బీసీ సీఎంల పేర్లను కేంద్రమంత్రి అమిత్ షా ప్రకటించడంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్(MP Laxman)గురువారం మీడియాతో మాట్లాడుతూ ..బీసీలను రాహుల్ గాంధీ అవమానించారని అన్నారు. అవకాశం వచ్చినా కాంగ్రెస్ పార్టీ బీసీలకు అవకాశం ఇవ్వలేదన్నారు. బీసీలు బీజేపీకి దగ్గరవుతారేమోనన్న భయంతోనే రాహుల్ గాంధీ ఈ ప్రకటన చేశారని ఆరోపించారు.
నవంబర్ 7న హైదరాబాద్ లో బీసీల ఆత్మగౌరవ సభ..
బీజేపీ తరపున 1358 మంది ఓబీసీ శాసనసభ్యులు గెలుపొందారని..160 మందికి శాసన మండలి సభ్యులుగా అవకాశం కల్పించారని పేర్కొన్నారు. తెలంగాణలో నవంబర్ 7వ తేదీ సాయంత్రం “బీసీల ఆత్మగౌరవం” పేరుతో హైదరాబాద్ లో సభ నిర్వహించనున్నామని.. ఈ సభకు ప్రధాని మోదీ హాజరవుతారని ఎంపీ తెలిపారు.
జనసేనతో పొత్తు బీజేపీకి మేలు చేస్తుంది :ఎంపీ లక్ష్మణ్
జనసేనతో పొత్తు బీజేపీకి మేలు చేస్తుందన్నారు. జనసేన పోటీ నుంచి తప్పుకోవడం వల్లే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందని అన్నారు. జనసేనతో పొత్తు ఉన్న నేపథ్యంలో టికెట్ ఆశిస్తున్న బీజేపీ అభ్యర్థులు నిరాశ చెందవద్దని సూచించారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. ఎన్నో పదవులు, అవకాశాలు ఉంటాయి.
తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు లేదు: MP Laxman
తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం ఎవరికి మద్దతు ఇస్తుందో ప్రకటించలేదని అన్నారు. ఎన్డీయేలో జనసేన భాగస్వామి అని చెప్పారు. మొన్నటి వరకు పార్టీ మారనని వివేక్ వెంకటస్వామి స్వయంగా ప్రకటించారని, ఇప్పుడు మనసు మారితే తననే అడగాలని ఎంపీ లక్ష్మణ్ అన్నారు.