సెప్టెంబర్ 17న సమైక్యత దినోత్సవంపై కొన్ని విపక్ష(opposition)పార్టీలు రాజకీయాలు చేసే కుట్రలు చేస్తున్నాయని భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆరోపించారు.
ప్రతి అంశానికి మతాన్ని జోడించి సమాజంలో చిచ్చుపెట్టే విచ్ఛిన్న కరశక్తుల కుట్రలను ప్రజలు గమనించి జాగ్రత్తగా ఉండాలన్నారు.
ప్రధానాంశాలు:
- విపక్షా(opposition) పార్టీలు రాజకీయాలు చేసే కుట్రలు
- ఆ రోజు బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ సభలు.
- ప్రతిపక్షాల ఒత్తిడితోనే..!
సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ప్రకటించారు.
రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించాలని, పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
విపక్షా(opposition) పార్టీలు రాజకీయాలు చేసే కుట్రలు..
తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేని రాజకీయ పార్టీలు ప్రతి అంశాన్ని రాజకీయం చేసే దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.
తెలంగాణ ప్రజలు సంబరంగా జరుపుకునే జాతీయ సమైక్యత దినోత్సవంపై కొన్ని పార్టీలు రాజకీయాలు చేసే కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు.
ఆనాటి చరిత్రతో, పరిణామాలతో సంబంధమే లేని అవకాశవాదులు, చిల్లర రాజకీయాలతో ఉజ్వలమైన చరిత్రను వక్రీకరించి మలినం చేసేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయన్నారు.
అత్యంత మేధో సంపత్తితో, క్రియాశీలతతో చురుకుగా స్పందించే తెలంగాణ సమాజం.. అదే చైతన్యాన్ని ప్రదర్శించి.. తెలంగాణ జీవన విధానం దీని కలుషితం చేయాలని చూస్తున్న విచ్ఛిన్నకర శక్తుల కుటిల యత్నాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
ఆ రోజు బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ సభలు.
ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ ఎవరికి వారు వేర్వేరు పేర్లతో హైదరాబాద్ వేదికగా సభలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. కానీ, బీఆర్ఎస్ మిన్నకుండి పోవడంతో సెప్టెంబరు 17పై అధికార పార్టీ ఎందుకు స్పందించడం లేదన్న చర్చ మొదలైంది.
దీనిపై ఒత్తిడి పెరగడంతో జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది. వాస్తవానికి ఏటా సెప్టెంబరు 17 వస్తోందంటేనే అధికార బీఆర్ఎస్ ఇరకాటంలో పడుతోంది. ఎందుకంటే.. సెప్టెంబరు17ను స్వతంత్ర దినోత్సవంగా జరపాలంటూ అప్పటి ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో డిమాండ్ చేశారు.
దీంతో 2014లో స్వరాష్ట్రం సిద్ధించాక.. సెప్టెంబరు 17ను స్వతంత్ర దినోత్సవంగా నిర్వహిస్తారని అంతా భావించారు. కానీ, కేసీఆర్ స్వయంగా చేసిన డిమాండ్నే పక్కనబెట్టారు. ఉద్యమ సమయం నుంచే బీజేపీ కూడా సెప్టెంబరు 17ను విమోచన దినోత్సవంగా నిర్వహించాలని కోరుతూ వస్తోంది.
ప్రతిపక్షాల ఒత్తిడితోనే..!
ప్రతిపక్షాలన్నీ 17వ తేదీని కీలకంగా వినియోగించుకుంటుండడంతో.. బీఆర్ఎస్ కూడా ఆ రోజుపై దృష్టి సారించి.. కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా శ్రేణులకు సూచించింది.
రాష్ట్ర వ్యాప్త సభ లేకుండా ఎక్కడికక్కడే కార్యక్రమాలు నిర్వహించాలని మాత్రమే పార్టీ సూచించడంతో 17వ తేదీని ఈ సారి అధికార పార్టీ సభల్లేకుండానే సరిపెట్టనుంది.
కానీ, ఇతర పార్టీలన్నీ భారీ ఎత్తున సభలు, సమావేశాలకు సమాయత్తం అవుతుండగా.. బీఆర్ఎస్ మాత్రం నామమాత్రంగానే వ్యవహరిస్తుండడంతో క్యాడర్లో కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ కార్యక్రమాలను కూడా ఎన్నికల కారణంగానే నిర్వహిస్తున్నారనే చర్చ పార్టీలోనే వ్యక్తమవుతుండడం గమనార్హం.