Asia Cup 2023: ఫైనల్లో భారత్ తో తలపడే జట్టు ఏది శ్రీలంక పై విజయంతో భారత్ Asia Cup 2023 ఫైనల్ చేరుకుంది. మిగిలిన ఒక బెర్త్ కోసం శ్రీలంక, పాకిస్థాన్ మధ్య పోటీ ఉంది.
ఇరు జట్లు గురువారం కీలక మ్యాచ్లో తలపడనున్నాయి. దీన్ని వర్చువల్ సెమీఫైనల్గా భావించొచ్చు.
ప్రేమదాస స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం భారత్తో ఫైనల్లో తలపడనుంది.
ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే మాత్రం మెరుగైన రన్ రేట్ ఉన్న శ్రీలంక టోర్నీలో ముందంజ వేస్తోంది. పాకిస్థాన్, శ్రీలంక చేతిలో ఓడిన బంగ్లాదేశ్ ఇప్పటికే ఇంటిదారి పట్టింది.
అయితే Asia Cup చరిత్రలో భారత్-పాకిస్థాన్ ఇప్పటి వరకు ఫైనల్లో తలపడలేదు.
టీమిండియా 7 సార్లు టైటిల్ గెలిచినా పాకిస్థాన్ రెండు సార్లు విజేతగా నిలిచినా ఈ ఇరు జట్లు ఒక్కసారి కూడా ఫైనల్ మ్యాచ్ ఆడలేదు.
ఈ టోర్నీ ప్రారంభానికి ముందు నిర్వహించిన ప్రెస్ మీట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఇదే విషయం పై ప్రశ్నించగా ఈ సారి గట్టిగా అనుకోండి అయిపోతుందని బదులిచ్చాడు.
మళ్లీ భారత్-పాక్ మ్యాచ్ జరగాలంటే శ్రీలంక ఓడిపోవాలి. ఇప్పటికే ఈ టోర్నీలో ఇరు జట్లు రెండు సార్లు తలపడగా లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది.
సూపర్-4 మ్యాచ్లో భారత బ్యాటర్లు చెలరేగడంతో పాకిస్థాన్ 228 పరుగుల భారీ తేడాతో చిత్తయ్యింది. శ్రీలంకతో మ్యాచ్లో భారత్ గెలవడం పాకిస్థాన్కు లబ్ధి చేకూర్చనుంది.
ఒకవేళ భారత్ గనుక శ్రీలంక చేతిలో ఓడిపోయి ఉంటే శ్రీలంక 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవడంతోపాటు ఫైనల్ చేరేది.
పాక్తో సమానంగా పాయింట్లు ఉన్నప్పటికీ మెరుగైన రన్ రేట్ కారణంగా భారత్ రెండో స్థానంలో నిలిచేది.
అప్పుడు పాకిస్థాన్ తన చివరి సూపర్-4 మ్యాచ్లో లంక పై గెలిచినా పెద్దగా ప్రయోజనం ఉండేది కాదు.
ఎందుకంటే భారత్ తన చివరి సూపర్-4 మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఓడిస్తే శ్రీలంక, భారత్, పాకిస్థాన్ మూడు జట్ల ఖాతాలో తలో నాలుగు పాయింట్లు చేరి మెరుగైన రన్రేట్ ఉన్న భారత్, శ్రీలంక ఫైనల్ చేరే అవకాశం ఉండేది.
అప్పుడు శ్రీలంక పై గెలిచినా సరే పాక్ ఇంటి ముఖం పట్టాల్సిన పరిస్థితి కానీ శ్రీలంకను భారత్ ఓడించడంతో
పాక్ తన చివరి లీగ్ మ్యాచ్లో గెలిస్తే చాలు మిగతా సమీకరణలతో సంబంధం లేకుండా ఫైనల్ చేరుకుంటుంది.