Home   »  తెలంగాణరాజకీయంవార్తలు   »   అమరవీరుల స్థూపం నిర్మాణంలో అవినీతి… కేటీఆర్‌పై రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు…

అమరవీరుల స్థూపం నిర్మాణంలో అవినీతి… కేటీఆర్‌పై రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు…

schedule yuvaraju

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అమరవీరుల స్థూపం నిర్మాణంలో అవినీతి జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2017లో నిర్మాణం చేపట్టినప్పుడు రూ. 66 కోట్లు అంచనా వేశారని అది ఇప్పుడు రూ. 155 కోట్లకు చేరిందన్నారు. కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై మంత్రి కేటీఆర్‌ అవినీతికి పాల్పడ్డారని రేవంత్‌రెడ్డి అన్నారు . దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజా సొమ్మును KCR ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది అన్నారు. సీఎం కేసీఆర్ పోలీసులతో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. తెలంగాణ అమరవీరుల పోరాటాల చరిత్రతో అమరవీరుల స్థూపం ఉండాలి. నేడు అమరవీరుల త్యాగాల భోగాలతో సీఎం కేసీఆర్ అధికారాన్ని అనుభవిస్తున్నారు. ఉద్యమకారుల త్యాగాలను అవమానించే విధంగా అమరవీరుల స్థూపం ఆవిష్కరణ జరుగుతుంది.

అమరవీరుల త్యాగాలను అవమానించే విధంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వ్యవహరిస్తున్నారు. అమరవీరుల స్థూపం నిర్మాణానికి సంబంధించి 2017 జూన్ 17 న కమిటీ రూపొందించింది. అమరవీరుల స్థూపాన్ని నిర్మించడం కోసం నిర్మాణ పనులను పర్యవేక్షణ చేయడానికి 6 శాతం డబ్బులు చెల్లించారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు.

అమరవీరుల స్థూప నిర్మాణానికి 63 కోట్ల 75 లక్షల 35 వేల 381 రూపాయలతో టెండర్లు పిలిచారు. KCP ప్రాజెక్ట్స్ పేరుతో కె.సి పుల్లయ్య కంపెనీకి టెండర్లు దక్కించుకున్నారు. కేటీఆర్ మిత్రుడు తేలుకుంట్ల శ్రీధర్ కు దగ్గరి వ్యక్తి కామిశెట్టి అనిల్ కుమార్ దక్కించుకున్నారు. ఆ తర్వాత 80 కోట్లు, ఆ తర్వాత 127 కోట్ల 50 లక్షలకు అంచనా వ్యయం పెంచారు. మళ్ళీ అంచనాకు 158 కోట్ల 85 లక్షలకు పెంచారు. ఆ తర్వాత 179 కోట్ల 5 లక్షలకు పెంచారు. అమరవీరుల స్థూపం నిర్మాణంలో స్టెయిన్ లెస్ స్టీల్ ను వాడారు. 8 MM కు అంచనా వేసి 4 MM స్టెయిన్ లెస్ స్టీల్ వాడారు. అడవుల్లో కట్టిన స్థూపాలు సైతం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి.  నూతన అమరవీరుల స్థూపంలో అమరవీరుల పేర్లను రాయలేదు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పేరు ఎందుకు పెట్టాలి? తెలంగాణ ఉద్యమం అంటే సీఎం కేసీఆర్ కుటుంబం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అమరవీరుల స్థూపం అంటే తెలంగాణ ఉద్యమం ప్రతిధ్వని. శ్రీకాంతాచారి,యాదయ్య లాంటి తెలంగాణ అమరవీరుల త్యాగం అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు .

అమరవీరుల స్థూపాన్ని సమైక్య వాదులు తాకాలంటే క్షమాపణ చెప్పి తాకాలి. అమరవీరుల స్థూప నిర్మాణం బాధ్యతను ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారికి అప్పగించారు. అమరవీరుల స్థూపాన్ని కట్టడానికి తొమ్మిదేళ్లు పట్టింది. తొమ్మిది నెలల్లో ప్రగతి భవన్ కట్టుకున్నారు. పవిత్రమైన తెలంగాణ అమరవీరుల స్థూపం నిర్మాణాన్ని ఆంధ్రా వారికి ఎలా కట్టబెడతారా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వ్యవహరించారు.