Madhapur P.S | తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న సిలిండర్లు పేలడం మాదాపూర్ పోలీస్ స్టేషన్లో తీవ్ర కలకలం చెలరేగింది. మాదాపూర్ DCP వినీత్ తెలిపిన వివరాల ప్రకారం… వీధి వ్యాపారుల నుంచి తనిఖీల్లో పట్టుబడిన నాలుగు సిలిండర్లను పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న ఖాళీ స్థలంలో తీసుకొచ్చి పెట్టారు. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా మాదాపూర్లో పోలీస్స్టేషన్ సమీపంలో సోమవారం భక్తులు టపాసులు కాల్చారు.
అందులో నుంచి చిన్న నిప్పురవ్వ ఎగిరి పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న సిలిండర్ పై పడి పేలుడు సంభవించింది. దీంతో మిగిలిన మూడు సిలిండర్లు పేలిపోయాయి. పోలీస్ స్టేషన్లో మంటలు చెలరేగడంతో పోలీసులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్ దగ్గర పటాకులు కాల్చే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ వినీత్ అన్నారు.