హైదరాబాద్ నుంచి ముంబై వెళుతున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
ప్రధానాంశాలు
సంగారెడ్డి జిల్లా పరిధిలో ఘటన
హైదరాబాద్ నుంచి ప్రయాణికులతో ముంబై వెళ్తున్న ప్రైవేటు బస్సు అర్ధరాత్రి సమయంలో సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం భూదేరా శివారులో ప్రమాదానికి గురైంది. బస్సు ప్రయాణికులతో నిండి ఉన్నప్పుడు, భూదేరా వద్ద మంటలు చెలరేగాయి. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన డ్రైవర్ రోడ్డు పక్కన బస్సును నిలిపివేసి ప్రయాణికులను అప్రమత్తం చేశాడు. బస్సు డ్రైవర్ అప్రమత్తం కావడంతో పదుల సంఖ్యలో ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు. ఆయన ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా పెను నష్టం జరిగి ఉండేది. దీంతో ప్రయాణికులు క్షణాల్లోనే బస్సును ఖాళీ చేశారు. ఆ వెంటనే బస్సు పూర్తిగా దగ్ధమైంది.
క్షణాల్లో బస్సును ఖాళీ చేసి ప్రాణాలు రక్షించుకున్న ప్రయాణికులు (fire accident in bus)
ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ప్రయాణికుల లగేజీలు, ఇతర వస్తువులు కాలి బూడిదయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు అనుమానిస్తున్నారు. ప్రయాణికులను వేరే బస్సులో గమ్యస్థానాలకు చేర్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Former CM KCR: కేసీఆర్ గాయం పై .. స్పందించిన ప్రధాని మోడీ