హైదరాబాద్: మోకిల హెచ్ఎండిఏ వెంచర్ ప్లాట్ల వేలానికి అమిత ఆధరణ లభిస్తోంది. మొదటి రోజు ఆన్లైన్ వేలంలో గజం అత్యధికంగా లక్ష రూపాయల ధర పలకడం గమనార్హం. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) మోకిల లో చేస్తున్న భారీ వెంచర్లో 50 ప్లాట్లకు వేలం నిర్వహించగా అన్నింటికీ మంచి డిమాండ్ వచ్చింది. రెండో దశలో 300 ప్లాట్లను హెచ్ఎండిఏ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టిసి ద్వారా బుధవారం నుంచి ఐదు రోజుల పాటు ఆన్ లైన్ వేలం ప్రక్రియను నిర్వహిస్తున్నది.
వేలానికి ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది. ప్లాట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. రెండో విడత వేలంలో గజం భూమి ధర రూ.లక్ష వరకు పలికింది. బుధవారం నుంచి రోజుకు 60 ప్లాట్ల చొప్పున 5 రోజుల్లో మొత్తం 300 ప్లాట్లను హెచ్ఎండీఏ విక్రయానికి ఉంచగా.. తొలి రోజు ఉదయం 30 ప్లాట్లను, మధ్యాహ్నం మరో 30 ప్లాట్లను వేలానికి పెట్టారు.
కొనుగోలుదారులు మెుత్తం 58 ప్లాట్లను సొంతం చేసుకున్నారు. హెచ్ఎండీఏకి తొలిరోజే రూ.122.42 కోట్ల ఆదాయం వచ్చింది. గజం ధర గరిష్ఠంగా రూ.లక్ష, కనిష్ఠంగా రూ.54 వేలు పలికింది. మెుత్తంగా అక్కడ గజం సగటు ధర రూ. 63,512గా పలికినట్లు హెచ్ఎండీఏ అధికారులు వెల్లడించారు.