హోంగార్డు (home guard) రవీందర్ ఆత్మహత్యా యత్నం ఇప్పుడు సర్పాత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే… రవీందర్ 75 శాతం కాలిపోగా.. ఆయన పరిస్థితి విషమంగా మారిందని వైద్యులు చెప్తున్నారు. దీంతో.. ఉస్మానియా ఆస్పత్రి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తన భర్త ఇలా చేసుకోవటంపై ఆయన భార్య పలు కీలక విషయాలు వెల్లడించారు.
ప్రధానాంశాలు:
- హోంగార్డు రవీందర్ ఆత్మహత్యా యత్నం
- రవీందర్ 75 శాతం కాలిపోగా.. ఆయన పరిస్థితి విషమం
- అధికారుల ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకున్న హోంగార్డు రవీందర్
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తోన్న హోంగార్డు రవీందర్ (home guard) ఆత్మహత్యాయత్నం ఇప్పుడు సంచలనంగా మారింది. అధికారుల ముందే ఒంటిపై పెట్రోల్ పోసుకుని హోంగార్డు రవీందర్ నిప్పంటించుకున్న విషయం తెలిసిందే.
మంగళవారం హైదరాబాద్లోని గోషామహల్లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన హోంగార్డు రవీందర్ పరిస్థితి విషమంగా ఉందని ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. దీంతో మెరుగైన చికిత్స కోసం డీఆర్డీవో అపోలో ఆస్పత్రికి తరలించారు.
హోంగార్డులను చిన్నచూపు చూస్తున్నారనే కారణంతో ఆత్మహత్యకు యత్నించానని రవీందర్ ఆవేదన వ్యక్తం చేశారు.
రవీందర్ భార్య సంధ్య స్పందించి.. కీలక విషయాలను బయటపెట్టారు. రెండు నెలలుగా జీతం లేకనే తన భర్త ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడని సంధ్య చెప్పుకొచ్చారు.
అయితే.. తన భర్త ఆత్మహత్యకు యత్నించడానికి కేవలం జీతం మాత్రమే కారణం కాదని, ఉన్నతాధికారుల వేధింపులు కూడా మరో ప్రధాన కారణమని వెల్లడించారు.
హోంగార్డుల అసోసియేషన్ జేఏసీ చైర్మన్ నారాయణ మాట్లాడుతూ రవీందర్కు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఈ నెల 16 వరకు రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డులు విధులు బహిష్కరిస్తామని చెప్పారు.
రవీందర్ ఆత్మహత్యా యత్నం ఘటనకు సీఎం కేసీఆరే పూర్తి బాధ్యత వహించాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ 2017లో అసెంబ్లీ సాక్షిగా హోంగార్డులను పర్మినెంట్ చేస్తానని మాట ఇచ్చి తప్పారని కిషన్ రెడ్డి విమర్శించారు.
సంధ్య : నా భర్తకు న్యాయం చేయాలి.
నా భర్తకు న్యాయం చేయాలి. ప్రభుత్వం వెంటనే మెరుగైన చికిత్స అందేలా చూడాలి. అధికారులు నా భర్తను దూషించి గొడవకు కారకులయ్యారు. నా భర్త ఆత్మహత్యా యత్నానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని రవీందర్ భార్య సంధ్య అధికారులను వేడుకున్నారు.