హైదరాబాద్: పాకిస్థాన్ కు చెందిన మహమ్మద్ ఫైజ్(24)అనే యువకుడిని హైదరాబాద్ లోని పాతబస్తీలో బహదూర్పురా పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాకిస్థాన్లోని ఖైబర్ ఫక్తున్ఖ్వాలోని స్వాత్ వ్యాలీకి చెందిన ఫైజ్ దుబాయ్లోని ఒక గార్మెంట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. 2019లో అతను పాతబస్తీలో నివసించే ఫాతిమా (29) ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లగా ఫైజ్ ఉద్యోగ రీత్యా ఆమెకు సహాయం చేశాడు.
తర్వాత వారిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ దంపతులకు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఆ తర్వాత నేహా ఇండియాకు తిరిగొచ్చింది. ఫైజ్ తన భార్య తల్లిదండ్రులు షేక్ జుబేర్, అఫ్జల్ బేగం సహాయంతో నేపాల్ మీదుగా దేశంలోకి ప్రవేశించాడని పోలీసులు తెలిపారు. ఫైజ్ ని మాదాపూర్లోని ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్కు తీసుకెళ్లి మహ్మద్ ఘౌస్ పేరుతో తమ కొడుకుగా నమోదు చేసుకున్నారు.
వారు నకిలీ జనన ధృవీకరణ పత్రాన్ని కూడా అందించారని తెలిపారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా బహదూర్పురాలోని అసద్ బాబా నగర్లోని అతని అత్తమామల ఇంట్లో ఉండగా పోలీసులు ఫైజ్ను అరెస్టు చేశారు. అయితే అతని అత్తమామలు జుబేర్, అఫ్జల్ పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.