ఏకంగా రైల్వే స్పెషల్ స్క్వాడ్ టికెట్ కలెక్టర్పైనే దౌర్జన్యం చేసి డబ్బులు వసూలు చేసిన వైనం.ఈ మధ్య కాలం లో రైళ్లనే టార్గెట్ చేసిన గజ దొంగలు. ఒంగోలు సంఘమిత్ర ఎక్స్ప్రెస్ రైల్లో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది.బెంగుళూరు నుంచి బీహార్లోని పాటలీపుత్ర జంక్షన్కు వెళ్ళే ఈ ఎక్స్ప్రెస్ రైల్లో నెల్లూరు – గూడూరు మధ్యలో ఈ రైలులో ప్రయాణిస్తున్న బీహార్ కి చెందిన 10 మంది గ్యాంగ్ రైల్వే స్పెషల్ స్క్వాడ్ టికెట్ కలెక్టర్ సుధీర్ పై దాడి చేశారు.
టికెట్ చెకింగ్ చేస్తున్న సమయంలో గ్యాంగ్ సభ్యులు టికెట్ కలెక్టర్ సుధీర్ పై గొడవకు దిగి దాడి చేశారు.సుధీర్ దగ్గర ఉన్న 27 వేల రూపాయల నగదును లాక్కొన్నారు. ఆ సమయంలో ఎదురు తిరిగిన టికెట్ కలెక్టర్ సుధీర్ను రైలు నుండి క్రిందకు తోసే ప్రయత్నం చేశారు. దీంతో భయంతో వారి నుంచి తప్పించుకున్న సుధీర్ నెల్లూరులో రైలులో నుంచి దిగి ఒంగోలులోని తోటి ఉద్యోగులకు సమాచారం అందించి వాళ్లని పట్టుకోమని కోరారు.
టికెట్ కలెక్టర్ సుధీర్ ఇచ్చిన సమాచారంతో ఒంగోలులో కాపుకాసిన రైల్వే ఉద్యోగులు రైలు ఒంగోలులో ఆపి బీహార్ గ్యాంగ్కు చెందిన నలుగురిని పట్టుకున్నారు. మిగిలిన ఆరుగురు పరారయ్యారు. తాము పట్టుకున్న బీహారీ గ్యాంగ్ సభ్యులను ఒంగోలు జిఆర్పి పోలీసులకు అప్పగించారు. పోలీసు స్టేషన్ లో బీహార్ గ్యాంగ్కు చెందిన వారిని రైల్వే ఉద్యోగులు పశ్నించారు.వాళ్ళతో మాట్లాడుతున్న క్రమంలో స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శ్రీకాంత్ రైల్వే ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీరు విచారిస్తే మేమెందుకు ఇక్కడ అంటూ బూతు పదాలు లంకించుకున్నాడు.
అదేంటయ్యా నా మీద దాడి చేశాడు, డబ్బులు లాక్కున్నాడు. ఆ డబ్బులు ఎక్కడున్నాయని అడుగుతున్నాను అంటూ టిటిఇ సుధీర్ మాట్లాడుతున్న సమయంలో కానిస్టేబుల్ శ్రీకాంత్ తనపై చేయిచేసుకున్నాడని ఆరోపిస్తున్నారు. అడ్డువచ్చిన మరో ఇద్దరు టిటిఇలపై కూడా కానిస్టేబుల్ శ్రీకాంత్ చేయిచేసుకున్నాడని చెబుతున్నారు. రైల్లో తమపై దాడి చేసిన బీహార్ గ్యాంగ్ సభ్యులను పట్టుకుని జిఆర్పి పోలీసులకు అప్పగిస్తే తమపైనే పోలీసులు దౌర్జన్యం చేయడంతో టిటిఇలు కానిస్టేబుల్ శ్రీకాంత్పై జిఆర్పి పోలీస్ సిఐకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే ఈ వ్యవహారంపై ఇటు రైల్వే టిటిఇలు, అటు రైల్వే పోలీసులు మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారని తెలిసింది.